ప్రధాని పర్యటనలో ఉత్కంఠ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటనలో వాతావరణ ప్రతికూలతల కారణంగా కొద్దిసేపు ఉత్కంఠ రాజ్యమేలింది. ఐఎస్‌బీలో ప్రధాని ప్రసంగం పూర్తయ్యాక

Published : 27 May 2022 05:35 IST

గాలిదుమారంతో రాకపోకలపై ప్రతిష్టంభన
మోదీ హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయ్యాక పెరిగిన వర్షం
బేగంపేట చేరుకున్నాక హమ్మయ్య అనుకున్న పోలీసులు
సీపీఐ నేతలు నారాయణ, చాడ గృహ నిర్బంధం

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, అమీర్‌పేట, రాయదుర్గం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటనలో వాతావరణ ప్రతికూలతల కారణంగా కొద్దిసేపు ఉత్కంఠ రాజ్యమేలింది. ఐఎస్‌బీలో ప్రధాని ప్రసంగం పూర్తయ్యాక మధ్యాహ్నం 3.30 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవాలి. ఆ సమయంలో గాలిదుమారం, వర్షం కురవడంతో ప్రధానిని రోడ్డు మార్గంలో పంపేందుకు పోలీసు అధికారులు గ్రీన్‌ఛానెల్‌ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కానీ మోదీ వర్షంలోనే హెలికాప్టర్‌ ఎక్కారు. హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయ్యాక వర్షం పెరగడంతో పోలీసు ఉన్నతాధికారులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.  మధ్యాహ్నం 3.45 గంటలకు హెలికాప్టర్‌ వచ్చిందంటూ బేగంపేట విమానాశ్రయం అధికారులు చెప్పడంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం కురుస్తున్నప్పుడు హెలికాప్టర్‌లో ప్రయాణించడం సురక్షితం కాదని, తక్కువ దూరమైనా సరే.. భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాణించకూడదని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి అన్నారు. ప్రధాని పర్యటన ఆద్యంతం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సాగింది. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. మోదీ రాకను అడ్డుకుంటామని సీపీఐ ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డిలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఆ పార్టీ కార్యకర్తలు కొందరు నల్లరంగు దుస్తులు ధరించి సీపీఐ రాష్ట్ర కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. గచ్చిబౌలి, బేగంపేట పరిసర ప్రాంతాల్లో ప్రధాని రాకకు ముందే పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో పోలీసులతో కొందరు వాగ్వాదానికి దిగారు. మధ్యాహ్నం 12.55 గంటలకు విచ్చేసిన మోదీ సాయంత్రం 4 గంటల వరకు మొత్తం 3.05 గంటలసేపు హైదరాబాద్‌లో ఉన్నారు.

గవర్నర్‌ తమిళిసై, సీఎస్‌ సోమేశ్‌, మంత్రి తలసాని స్వాగతం
దిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి విచ్చేసిన ప్రధానికి గవర్నర్‌ తమిళిసై, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, డీజీపీ మహేందర్‌రెడ్డిలతోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితరులు స్వాగతం పలికారు. తిరుగు ప్రయాణంలో చెన్నైకి ప్రత్యేక విమానంలో బయలుదేరిన మోదీకి వీడ్కోలు కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొనలేదు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కూడా మోదీ స్వాగత, వీడ్కోలు కార్యక్రమాలకు హాజరు కాలేదు.

మంత్రి తలసానికి గ్రీన్‌ ఛానెల్‌
ప్రధానమంత్రికి ప్రొటోకాల్‌ ప్రకారం స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లో లేకపోవడంతో రాష్ట్రప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి తలసానికి ఆ బాధ్యతలు అప్పగించారు. బేగంపేటలో ప్రధానికి స్వాగతం పలికిన అనంతరం తలసాని రోడ్డు మార్గంలో ఐఎస్‌బీ వద్ద స్వాగతం పలకడానికి వెళ్లేందుకు పోలీసులు గ్రీన్‌ఛానెల్‌ ఏర్పాటు చేశారు.

స్వాగత కార్యక్రమంలో పార్టీ నేతలు
ప్రధానమంత్రికి భాజపా నేతలు సహా పలువురు స్వాగతం పలికారు. వీరిలో కశ్మీరీ ఫైల్స్‌ సినిమా నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కూడా ఉన్నారు. మొత్తంగా 75 మంది స్వాగత, వీడ్కోలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వాగతం పలుకుతూ అభివాదం చేసిన బండి సంజయ్‌ని మోదీ పలకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని