నేనే అసలు లీజుదారుణ్ని

డెక్కన్‌ కిచెన్‌ రెస్టారెంట్‌ నిర్వహిస్తున్న స్థలాన్ని చట్టప్రకారమే లీజుకు తీసుకున్నానని.. తానే అసలు లీజుదారుడినని ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడు నందకుమార్‌ పోలీసులకు తెలిపారు.

Updated : 29 Nov 2022 05:45 IST

డెక్కన్‌ కిచెన్‌ వివాదంలో నందకుమార్‌
కస్టడీలో తీసుకుని విచారించిన పోలీసులు

ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే-జూబ్లీహిల్స్‌: డెక్కన్‌ కిచెన్‌ రెస్టారెంట్‌ నిర్వహిస్తున్న స్థలాన్ని చట్టప్రకారమే లీజుకు తీసుకున్నానని.. తానే అసలు లీజుదారుడినని ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడు నందకుమార్‌ పోలీసులకు తెలిపారు. ఆయనను బంజారాహిల్స్‌ పోలీసులు సోమవారం కస్టడీకి తీసుకొని విచారించారు. జూబ్లీహిల్స్‌(ఫిలింనగర్‌ చౌరస్తా)లోని డెక్కన్‌ కిచెన్‌ లీజు వివాదంలో ఆయనపై ఈ నెల 13న మహేంద్ర హిల్స్‌కు చెందిన సయ్యద్‌ అజాద్‌ బంజారాహిల్స్‌ పోలీసుకు ఫిర్యాదు చేశారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న నందకుమార్‌ నుంచి ఈ కేసుకు సంబంధించి వివరాలు రాబట్టేందుకు పోలీసులు కస్టడీ కోరారు. సోమ, మంగళవారాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలనే న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఉస్మానియా ఆసుపత్రిలో అతడికి వైద్యపరీక్షలు నిర్వహించి బంజారాహిల్స్‌ ఠాణాకు తరలించారు. సాయంత్రం 4.30 గంటల వరకు ఏసీపీ సుదర్శన్‌, సీఐ నరేందర్‌ విచారించారు. సుమారు 20 ప్రశ్నలు అడిగి.. సమాధానాలు రాబట్టినట్టు సమాచారం. మంగళవారమూ విచారించనున్నారు.

ఎవరికీ సబ్‌లీజుకు ఇవ్వలేదు

‘‘డెక్కన్‌ కిచెన్‌ నిర్వహిస్తున్న స్థలాన్ని మరెవరికీ సబ్‌లీజుకు ఇవ్వలేదు. సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌ కుటుంబానికి చెందిన జూబ్లీహిల్స్‌లోని 3,000 చదరపు అడుగుల ఖాళీ స్థలాన్ని 2014లో ప్రమోద్‌కుమార్‌ లీజుకు తీసుకోగా, 2015లో ఆయన నుంచి నేను లీజుకు తీసుకున్నాను. 2017 నుంచి అక్కడ భవన నిర్మాణాలు చేపట్టాను. డబ్ల్యూ3(వరల్డ్‌ ఉయ్‌ విష్‌) హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను ప్రారంభించారు. డెక్కన్‌ కిచెన్‌ పేరుతో రెస్టారెంట్‌ను తెరిచాను. 2021లో అభిషేక్‌, కన్నారావు సంస్థలో డైరెక్టర్లుగా చేరారు. 2019-20లోనే దగ్గుబాటి సురేశ్‌బాబు, వెంకటేశ్‌ సోదరుల నుంచి సేల్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నాను. వారికిచ్చిన బ్యాంకు చెక్కుల వివరాలున్నాయి. సురేశ్‌బాబుతో ఉన్న స్థల వివాదం కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది’’ అని విచారణ సందర్భంగా పోలీసులకు నందకుమార్‌ తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు నందకుమార్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

బంజారాహిల్స్‌ ఠాణాలో ఆరు కేసులు..

బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో నందకుమార్‌పై గతంలో ఆరు కేసులు నమోదయ్యాయి. 3,000 చదరపు అడుగుల స్థలాన్ని వ్యాపార కార్యకలాపాలకు సబ్‌లీజుకిచ్చి తమను నష్టపోయేలా చేశాడంటూ నందకుమార్‌పై సయ్యద్‌ అజాద్‌, సంజయ్‌రెడ్డి, ఇందిర, అశ్విన్‌రెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు. వికారాబాద్‌ జిల్లా దోమ మండలంలోని బోంపల్లి సమీపంలో వివాదంలో ఉన్న 12 ఎకరాల భూమిని కొనుగోలు చేయించిన నందకుమార్‌ రెండు దఫాలుగా రూ.33 లక్షలు వసూలు చేసి.. తమ అనుకూల ప్రభుత్వం వచ్చాక భూమిపై హక్కుదారుణ్ని చేస్తానంటూ మోసగించాడంటూ సతీశ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు ఇచ్చారు. ఈమేరకు నిందితుడిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని