ఆన్‌లైన్‌ టికెట్లలో ప్రథమ స్థానం.. దేశంలోనే ద.మ.రైల్వే ముందంజ

దక్షిణ మధ్య రైల్వేలో అన్‌ రిజర్వుడ్‌ రైలు టికెట్లను డిజిటల్‌ పద్ధతిలో తీసుకునేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

Published : 31 Mar 2023 04:46 IST

అన్‌రిజర్వుడ్‌ బుకింగ్‌లో 38 శాతం డిజిటలే

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వేలో అన్‌ రిజర్వుడ్‌ రైలు టికెట్లను డిజిటల్‌ పద్ధతిలో తీసుకునేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ విభాగంలో ద.మ.రైల్వే దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్‌రిజర్వుడ్‌ టికెట్లలో 38.13 శాతం డిజిటల్‌ పద్ధతిలోనే విక్రయమయ్యాయి. మొత్తం 17.90 కోట్ల మంది ప్రయాణికులు అన్‌ రిజర్వుడ్‌ బోగీల్లో ప్రయాణం చేయగా.. వారిలో కౌంటర్లలో టికెట్లు కొన్నవారి సంఖ్య 11.07 కోట్లు కాగా.. 6.83 కోట్ల మంది డిజిటల్‌ పద్ధతిలో తీసుకున్నారు. వీరిలో మొబైల్‌ ఫోన్‌ నుంచి యూటీఎస్‌ యాప్‌ ద్వారా 2.21 కోట్ల మంది, ఆటోమేటిక్‌ వెండింగ్‌ మెషిన్ల నుంచి 4.62 కోట్ల మంది టికెట్లు తీసుకున్నారు. రైల్వేస్టేషన్లలో టికెట్‌ కౌంటర్ల వద్ద చాంతాడంత వరుసలు, రద్దీ నివారణకు డిజిటల్‌ టికెటింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు ద.మ.రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ జోన్‌లోని ఆరు డివిజన్లలో నాందేడ్‌ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ గతంలో స్టేషన్‌కు 5 కి.మీ. దూరం నుంచి యూటీఎస్‌ యాప్‌ ద్వారా టికెట్లు తీసుకునే అవకాశం ఉండగా ద.మ.రైల్వే ఇటీవల ఆ దూరాన్ని 20 కి.మీ.కి పెంచడంతో వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది.


సులభంగా, పారదర్శకంగా..

ద.మ.రైల్వేలో డిజిటలైజేషన్‌ని యుద్ధప్రాతిపదికన అమలు చేస్తున్నాం. తద్వారా పారదర్శకత పెరగడం, ప్రయాణికులకు సమయం ఆదా వంటి ప్రయోజనాలున్నాయి. అవినీతిపై ఫిర్యాదులు తగ్గాయి. తరచూ ప్రయాణం చేసే వారి మొబైల్‌ ఫోన్లలో యూటీఎస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయిస్తున్నాం. సికింద్రాబాద్‌లో రైలు ఎక్కాల్సిన వారు దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లిలో ఉంటే.. ఇంటి నుంచే ఫోన్‌లో జనరల్‌ టికెట్‌ తీసుకోవచ్చు. పార్సిల్‌ నిర్వహణ వ్యవస్థనూ మరో 22 స్టేషన్లలో అమలు చేయబోతున్నాం. రిజర్వేషన్‌ టికెట్‌కు పీఎన్‌ఆర్‌లా.. పార్సిల్‌ బుకింగ్‌కు ఎఫ్‌ఎన్‌ఆర్‌ ఇస్తున్నాం. దీని ద్వారా పార్సిల్‌ ఎక్కడ ఉందో ఫోన్‌లో తెలుసుకోవచ్చు.

జాన్‌ ప్రసాద్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌, ద.మ.రైల్వే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని