ఘన వ్యర్థాల శుద్ధికి మోక్షమెప్పుడో?

రాష్ట్రంలోని 130 పురపాలక సంఘాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటు దస్త్రాలను దాటడం లేదు. పురపాలక సంఘాల్లో పెద్దమొత్తంలో చెత్త ఉత్పత్తవుతోంది.

Published : 02 Jun 2023 04:12 IST

130 పురపాలికల్లో కొలిక్కిరాని ప్రక్రియ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 130 పురపాలక సంఘాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటు దస్త్రాలను దాటడం లేదు. పురపాలక సంఘాల్లో పెద్దమొత్తంలో చెత్త ఉత్పత్తవుతోంది. దాన్ని శాస్త్రీయంగా శుద్ధి చేసేందుకు పెద్దమొత్తంలో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుడు నవంబరులో టెండర్లు పిలిచింది. గడువు ముగిసి ఆరు నెలలు గడిచినా ఇప్పటివరకు ఆ ప్రక్రియ కొలిక్కి రాలేదు.

క్లస్టర్లుగా పురపాలికల విభజన

రాష్ట్రంలో చెత్తను పూర్తిస్థాయిలో శుద్ధి చేయటం లేదంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) అధికారులకు అక్షింతలు వేయటంతో.. కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నడుం కట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 12,125 టన్నుల చెత్త వస్తుండగా.. 9,879 టన్నులను మాత్రమే శుద్ధి చేయగలుగుతున్నారు. మిగిలిందీ శుద్ధి చేయాలంటే భారీగా నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒకే దఫా పెద్దసంఖ్యలో చెత్త శుద్ధి కేంద్రాల ఏర్పాటు కష్టతరం కావటంతో క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్‌ పరిధిలో కనిష్ఠంగా పది, గరిష్ఠంగా ఇరవై పురపాలికలు ఉండేలా ప్రతిపాదించారు. మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, జనగామ క్లస్టర్‌లో 16 పురపాలికలు, రంగారెడ్డి జిల్లా క్లస్టర్‌ పరిధిలో 14, నల్గొండ, సూర్యాపేట క్లస్టర్‌లో 11, ఖమ్మం, వరంగల్‌, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్‌ పరిధిలో 15, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ-గద్వాల, నారాయణపేట పరిధిలో 19, కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల పరిధిలో 11, కామారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌ పరిధిలో 10, ఆదిలాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, కుమురంభీం, జయశంకర్‌ భూపాలపల్లి పరిధిలో 14, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌ క్లస్టర్‌ పరిధిలో 20పురపాలికలను ఏర్పాటు చేశారు.

ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసినా..

చెత్త నిర్వహణ కేంద్రాల ఏర్పాటు టెండర్లలో రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలతోపాటు ఇతర రాష్ట్రాల్లోవీ   పాల్గొన్నట్లు సమాచారం. టెండర్ల పరిశీలనకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని సైతం ఏర్పాటు చేసింది. టెండర్ల గడువు ముగిసి ఆరు నెలలు గడిచినా కొలిక్కిరాలేదు. ఈ ప్రాజెక్టును  డిజైన్‌, బిల్డ్‌,  ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎఫ్‌ఓటీ) ప్రాతిపదికన చేపట్టాల్సి ఉంది. గుత్తేదారులను ఖరారు చేసినా కేంద్రాలు  అందుబాటులోకి  వచ్చేందుకు  ఏడాదిన్నర నుంచి  రెండేళ్ల వరకు పడుతుందన్నది అంచనా. టెండర్లు ఆహ్వానించినా ఎందుకు ఖరారు చేయలేదన్నది చర్చనీయాంశంగా ఉంది.

ప్రత్యామ్నాయాలపై అధికారుల దృష్టి

చెత్త సద్వినియోగానికి ప్రత్యామ్నాయ మార్గాలపైనా అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వ్యర్థాలతో పాదచారుల నడక ప్రాంతాల్లో వేసే టైల్స్‌ తదితరాలను తయారు చేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో ఉష్ణోగ్రతను మూడు నుంచి నాలుగు శాతం తగ్గించేందుకు చలువ పైకప్పు విధానాన్ని ప్రభుత్వం ఆవిష్కరించింది. అందుకు ఉపకరించే టైల్స్‌ను వ్యర్థాలను ఉపయోగించి తయారీ చేయడంపై అధికారులు దృష్టి సారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని