వట్టిపోయిన రిజర్వాయర్లు

నీటి నిర్వహణ, యాజమాన్యంలోని లోపాలను శ్రీశైలం లాంటి ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు ఎత్తిచూపుతున్నాయి. గోదావరిలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.

Published : 07 Jun 2023 03:35 IST

కృష్ణా పరీవాహకంలో దారుణ పరిస్థితి
గోదావరి బేసిన్‌లో కాస్త మెరుగు

తెలుగు రాష్ట్రాలకు జీవధారలైన కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు గత వానాకాలం సీజన్‌ వచ్చేసరికే కొంతమేరకు నీటిమట్టాలను కలిగి ఉన్నాయి. తర్వాత భారీగా వరదలు వచ్చి ప్రాజెక్టులన్నీ రెండు, మూడుసార్లు పొంగిపొర్లాయి. ప్రస్తుత వానాకాలం సీజన్‌కు మాత్రం వాటి పరిస్థితి కొంత భిన్నంగా మారింది. ప్రత్యేకించి కృష్ణా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు బాగా తగ్గాయి.

నీటి నిర్వహణ, యాజమాన్యంలోని లోపాలను శ్రీశైలం లాంటి ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు ఎత్తిచూపుతున్నాయి. గోదావరిలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. కృష్ణా, గోదావరి నదులపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టుల్లో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 779.15 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 332 టీఎంసీలే ఉన్నాయి. వీటిలో వినియోగానికి వీలు లేని(డెడ్‌ స్టోరేజీ) నీటిని మినహాయిస్తే అందుబాటులో ఉండేది చాలా తక్కువ. నిరుడు రికార్డు స్థాయిలో 7,582 టీఎంసీలు కృష్ణా, గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లడంతోపాటు రెండు బేసిన్లలో వినియోగించుకొన్న నీటిని కూడా పరిగణనలోకి తీసుకొంటే 9,000 టీఎంసీలకు పైగా వచ్చాయి. ఇంత నీటి లభ్యత ఉన్న సంవత్సరం కూడా క్యారీ ఓవర్‌ కింద వినియోగానికి ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఉంది. ఎగువన ఉన్న ఆలమట్టిలోనూ గత ఏడాది జూన్‌ కంటే ఇప్పుడు చాలా తక్కువగా నీళ్లున్నాయి. అందులోకి 100 టీఎంసీలకు పైగా వస్తే కానీ దిగువకు వదల లేరు. తుంగభద్రకు ముగిసిన నీటి సంవత్సరంలో అత్యధికంగా 600 టీఎంసీలు రాగా... అందులో నుంచి 450 టీఎంసీలకు పైగా శ్రీశైలానికి వచ్చాయి. అందులో ఇప్పుడు అయిదు టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అంటే మరో వంద టీఎంసీలు వస్తేనే దిగువకు వదులుతారు. ఆలమట్టి, తుంగభద్ర నుంచి వస్తేనే శ్రీశైలం పరిస్థితి మెరుగు పడుతుంది. ప్రస్తుత సీజన్‌లో జులై, ఆగస్టులో వచ్చే ప్రవాహాలపైనే రెండు రాష్ట్రాల ఆయకట్టులో సాగు ఆధారపడి ఉంది.

 ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని