భారత్‌-సెర్బియాల మధ్య ఫలవంతమైన చర్చలు

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్‌ సువిక్‌ల మధ్య గురువారం ఫలవంతమైన చర్చలు జరిగాయి.

Published : 09 Jun 2023 04:36 IST

బెల్‌గ్రేడ్‌: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్‌ సువిక్‌ల మధ్య గురువారం ఫలవంతమైన చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్‌, సెర్బియాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సైన్స్‌, సమాచార, డిజిటల్‌ సాంకేతికతలలో పరస్పర సహకారాన్ని వృద్ధి చేసుకోవాలని నిర్ణయించారు.  రెండు దేశాల ప్రజల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు, రాకపోకలు పెంచుకోవాలని తీర్మానించారు. అలీనోద్యమం ప్రారంభమైనప్పటి నుంచి భారత్‌, సెర్బియాల మధ్య స్నేహ సంబంధాలు వర్థిల్లుతున్నాయని రాష్ట్రపతి ముర్ము ఉద్ఘాటించారు. సెర్బియాను సందర్శించిన మొట్టమొదటి భారత రాష్ట్రపతి ఆవిడే. 2017లో వుసిక్‌ సెర్బియా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత్‌కు వచ్చారు. సురినామ్‌ పర్యటన అనంతరం బుధవారం సెర్బియా చేరిన ముర్ముకు సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్‌ వుసిక్‌ ఘన స్వాగతం పలికారు.

బుధవారం స్థానిక భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి.. 2047కల్లా భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని చెప్పారు. 3.5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీని అందుకొంటున్న భారత్‌ ఈ దశాబ్దాంతానికి ప్రపంచంలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు.  అంతర్జాతీయ వేదికపై భారత్‌ వర్ధమాన దేశాల వాణిని వినిపిస్తోందనీ, ఏ సవాలు ఎదురైనా మొదటే స్పందిస్తోందని ఆమె వివరించారు. భారతదేశంలో లింగనిష్పత్తి మహిళలకు అనుకూలంగా మారుతోందని, సివిల్‌ సర్వీసు పరీక్షల్లో మొదటి నాలుగు స్థానాలను యువతులే సాధించారని గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని