మరింత దిద్దుబాటలో మాల్దీవులు

ప్రధాని మోదీ, లక్షద్వీప్‌పై తమ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై మరిన్ని దిద్దుబాటు చర్యలకు మాల్దీవుల ప్రభుత్వం పూనుకుంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానివి కావని మరోసారి స్పష్టం చేసింది.

Updated : 09 Jan 2024 04:45 IST

మంత్రుల వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టీకరణ
భారత హైకమిషనర్‌ భేటీలో వివరణ

మాలె, దిల్లీ: ప్రధాని మోదీ, లక్షద్వీప్‌పై తమ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై మరిన్ని దిద్దుబాటు చర్యలకు మాల్దీవుల ప్రభుత్వం పూనుకుంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానివి కావని మరోసారి స్పష్టం చేసింది. మాల్దీవుల విదేశాంగశాఖ ప్రతినిధి అలీ నాజర్‌ మహమ్మద్‌తో సోమవారం భారత హైకమిషనర్‌ మును మహావర్‌ భేటీ అయ్యారు. మంత్రులు, ఎంపీల వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్దేశాలు కావని అలీ నాజర్‌ వివరించినట్లు అధికారి ఒకరు తెలిపారు. పొరుగు దేశంతో సత్సంబంధాలనే కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేసినట్లు వివరించారు. అంతకుముందు దిల్లీలోని మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహీబ్‌ను విదేశాంగశాఖ పిలిపించింది. మోదీపై మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మోదీపై, లక్షద్వీప్‌పై విద్వేష వ్యాఖ్యలు చేసిన మంత్రులు ముగ్గురిని ఆదివారం మాల్దీవుల ప్రభుత్వం సస్పెండు చేసిన సంగతి తెలిసిందే.

మాల్దీవులకు విమానాల బుకింగ్‌ను నిలిపేసిన ఈజ్‌ మైట్రిప్‌

భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రైవేటు పర్యాటక సంస్థ ఈజ్‌ మైట్రిప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి విమానాల బుకింగ్‌ను నిలిపేస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్‌ పిత్తీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ సంస్థ దిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది.


బాయ్‌కాట్‌ ట్రెండింగ్‌ వేళ చైనాలో అధ్యక్షుడు

ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించడంపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన వేళ ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు చైనా పర్యటనకు వెళ్లారు. తన సతీమణితో కలిసి ఆదివారం రాత్రి ఆయన పయనమయ్యారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకు ఐదు రోజుల అధికారిక పర్యటన సాగుతోంది. మయిజ్జుకు చైనాకు అనుకూలమైన వ్యక్తిగా పేరుంది. తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా అక్కడికే వెళ్లారు.


లక్షద్వీప్‌కు అమితాబ్‌ ప్రచారం

క్షద్వీప్‌లో పర్యాటకానికి తన ప్రోత్సాహం అందిస్తానని బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ తెలిపారు. లక్షద్వీప్‌, అండమాన్‌లాంటి మన ప్రాంతాలే అత్యుత్తమం అని కొనియాడారు. ‘మనం ఇండియన్లం. మనం స్వయం సమృద్ధి సాధించాం. మా ఈ స్వీయ అభివృద్ధిని పరీక్షించొద్దు. జైహింద్‌ (హమ్‌ భారత్‌ హై.. హమారీ ఆత్మ నిర్భరతా పర్‌ ఆంచ్‌ మత్‌ దాలియే జై హింద్‌)’ అని అమితాబ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని