India-US Ties: భారత్‌-అమెరికా సంబంధాలపై చాలా ఆశాజనకంగా ఉన్నా: ఎస్‌.జైశంకర్‌

భారత్‌-అమెరికా సంబంధాలపై తాను చాలా ఆశాజనకంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వెల్లడించారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌తో

Published : 28 Sep 2022 10:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-అమెరికా సంబంధాలపై తాను చాలా ఆశాజనకంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వెల్లడించారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకర్ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల సంబంధాలు ఎలా ఉన్నాయనే ప్రశ్నపై స్పందిస్తూ.. ‘‘మా రెండు దేశాల సంబంధాలపై నేను చాలా ఆశాజనకంగా ఉన్నాను. ఈ విషయాన్ని చాలా సూటిగా చెబుతున్నాను. ముఖ్యంగా గత నాలుగేళ్లుగా ఇరుదేశాల దౌత్య సంబంధాల్లో పెనుమార్పులు వచ్చాయి. ఈ మార్గాన్ని నేను ఎలా చూస్తున్నాను అనేగా మీ ప్రశ్న..? నిజాయితీగా చెబుతున్నాను.. ప్రస్తుతం అమెరికా మరింత దగ్గరైంది. ముఖ్యంగా భారత్‌ వంటి దేశాలు దగ్గరయ్యేందుకు మార్గాలు తెరిచింది. సంప్రదాయ పొత్తులకు అతీతంగా ఆలోచిస్తోంది. భాగస్వాములతో సమర్థంగా పనిచేయగల వేదికలను చాలా బాగా సిద్ధం చేస్తోంది. క్వాడ్‌ను చూడండి.. గత రెండు దశాబ్దాలుగా పెద్దగా పనిచేయలేదు. కానీ, ఇప్పుడు చాలా ప్రభావవంతంగా పనిచేస్తోంది. ముఖ్యంగా రెండేళ్ల నుంచి ఈ మార్పు కనిపిస్తోంది. అమెరికాతో కలిసి ప్రపంచ దిశను మార్చేందుకు కలిసి పనిచేస్తున్నాం. అమెరికాతో కలిసి మరింతగా ముందుకు సాగుతాం. భవిష్యత్తులో ఇలాంటి సందర్భాలు మరిన్ని వస్తాయి’’ అని పేర్కొన్నారు. 

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ మాట్లాడుతూ ‘‘ప్రపంచంలో రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కావడంతో ఈ శతాబ్దపు దశ, దిశను మార్చేందుకు చాలా అవకాశాలు, సామర్థ్యాలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంత విధంగా భారత్‌-అమెరికా కలిసి పనిచేస్తున్నాయని చెప్పడం సంతోషంగా ఉంది. అలాగని మా మధ్య అభిప్రాయ భేదాలు లేవని కాదు.. ఉన్నాయి.. భవిష్యత్తులో కూడా ఉంటాయి. మా మధ్య లోతైన నాణ్యమైన బంధం ఉండటం వల్లే అది సాధ్యమైంది. మేము అన్ని అంశాలపై మాట్లాడతాం’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని