Rishi Sunak: భార్య కోసమే కొత్త బడ్జెట్‌ పాలసీ.. రిషి సునాక్‌పై విమర్శలు

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో తీసుకొచ్చిన కొత్త విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భార్య వ్యాపార ప్రయోజనాల కోసం ఆ స్కీంను ప్రకటించారని ప్రత్యర్థులు మండిపడుతున్నారు.

Updated : 01 Apr 2023 10:56 IST

లండన్‌: బ్రిటన్‌ (Britain) ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రిషి సునాక్‌ (Rishi Sunak)ను విమర్శలు, వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన మరోసారి వివాదాస్పద వార్తల్లో నిలిచారు. ఇటీవల రిషి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఓ కొత్త పాలసీపై విపక్షాలు మండిపడుతున్నాయి. తన భార్య అక్షతా మూర్తి (Akshata Murty) వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ నూతన విధానాన్ని తీసుకొచ్చారంటూ రిషిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలేం జరిగిందంటే..

మార్చి ఆరంభంలో యూకే (UK) ప్రభుత్వం స్ప్రింగ్‌ బడ్జెట్‌ (Budget)ను ప్రవేశపెట్టింది. అందులో చిన్నారుల సంరక్షణకు ఆయాల (ఛైల్డ్‌ మైండర్స్‌) సేవలను అందించే కంపెనీలకు ప్రోత్సాహాకాలు కల్పించేలా నూతన పైలట్‌ పథకాన్ని ప్రకటించారు. కాగా.. ఇలాంటి సేవలనే అందించే ‘కోరు కిడ్స్‌ లిమిటెడ్‌’ అని కంపెనీలో రిషి (Rishi Sunak) సతీమణి అక్షతా మూర్తి వాటాదారుగా ఉన్నారు. దీంతో భార్య వ్యాపార ప్రయోజనాల కోసమే ప్రధాని ఈ పైలట్‌ ప్రాజెక్టును ప్రవేశపెట్టారంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

‘‘ఈ స్కీమ్‌ను తీసుకురావడం వెనుక ప్రత్యేక ఆసక్తి ఏమైనా ఉందా? సొంత ప్రభుత్వ విధానాల నుంచి రిషి సునాక్‌ కుటుంబం అదనపు ఆదాయాన్ని పొందాలనుకుంటుందా? ఈ ప్రశ్నలకు సునాక్‌ సమాధానం చెప్పాల్సిందే’’ అని ప్రతిపక్ష లిబరల్‌ డెమోక్రాట్‌ చీఫ్‌ విప్‌ వెండీ ఛాంబెర్లేన్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. అయితే ఈ ఆరోపణలను 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ ఖండించింది.

కాగా.. రిషి సునాక్‌ (Rishi Sunak) ప్రధాని కాకముందు కూడా తన భార్య పన్నుల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అయిన అక్షతామూర్తి.. బ్రిటన్‌కు వెలుపల సంపాదించిన సొమ్ముపై పన్నులు చెల్లించట్లేదని ఆయన ప్రత్యర్థులు ఆరోపించారు. ఇది కాస్తా తీవ్ర వివాదస్పదం కావడంతో స్పందించిన అక్షతా.. ఇకపై ప్రపంచవ్యాప్తంగా ఆర్జించే ధనంపై కూడా యూకేలో పన్ను చెల్లిస్తానని అప్పట్లో ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని