Virus: గబ్బిలాల్లో మానవులకు సోకే మరో వైరస్‌ గుర్తింపు: ఎకోహెల్త్‌

Virus: గబ్బిలాల్లో మరో ప్రమాదరకమైన వైరస్‌ను గుర్తించినట్లు ‘ఎకోహెల్త్‌ అలయన్స్‌’ పరిశోధనా సంస్థ WHO సమావేశంలో వెల్లడించింది.

Published : 14 Jan 2024 11:55 IST

జెనీవా: గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదం ఉన్న మరో కొత్త వైరస్‌ను (Virus) థాయ్‌లాండ్‌లో గుర్తించినట్లు న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఎకోహెల్త్‌ అలయన్స్‌’ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. దీన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదని ఇటీవల జరిగిన ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)’ సమావేశంలో శాస్త్రవేత్త డాక్టర్‌ పీటర్‌ దస్జాక్ వెల్లడించారు. చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లో గతంలో పరిశోధనలు జరిపిన ఈ ఎకోహెల్త్‌పై గతంలో అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ఈ ల్యాబ్‌ నుంచే కరోనావైరస్‌ లీకైందని వచ్చిన అనుమానాలనూ ఈ సంస్థ కొట్టిపారేసింది.

కరోనా (Coronavirus) స్థాయిలో వ్యాపించే సామర్థ్యం తాజాగా గుర్తించిన కొత్త వైరస్‌కూ ఉందని పీటర్‌ తెలిపారు. థాయ్‌లాండ్‌లో ఓ గుహలోని గబ్బిలాల్లో దీన్ని గుర్తించినట్లు చెప్పారు. స్థానిక రైతులు ఈ గుహ నుంచి గబ్బిలాల ఎరువును పంట పొలాల్లో ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఎరువులోనే ఆ వైరస్‌ (Virus) ఉన్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మనుషులతో తరచూ కాంటాక్ట్‌లోకి వస్తున్న ఈ వైరస్‌ భవిష్యత్‌లో అత్యవసర పరిస్థితులను తీసుకొచ్చే ప్రమాదం ఉందని తెలిపారు.

గత నెలలో ప్రపంచవ్యాప్తంగా కరోనా (Coronavirus) కేసులు పెరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్‌లో దాదాపు 10 వేల మరణాలు నమోదయ్యాయని WHO తెలిపింది. కొత్త ఉపవేరియంట్‌ JN.1 వ్యాప్తితో పాటు సెలవుల నేపథ్యంలో ప్రజలు గుమిగూడటమే అందుకు కారణమని వివరించింది. ఈ నేపథ్యంలో సంస్థ నిర్వహించిన అత్యవసర సమావేశంలో పీటర్ కొత్త వైరస్‌ గురించి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని