News In Pics : చిత్రం చెప్పే సంగతులు -2 (20-11-2022)
Updated : 20 Nov 2022 21:45 IST
1/17
వికారాబాద్ జిల్లాలోని ధరూర్ మండలంలో ధారూర్, డోర్నల్ గ్రామాల మధ్య మెథడిస్ట్ జాతరను ఘనంగా నిర్వహించారు. పెద్దఎత్తున తరలివచ్చిన క్రైస్తవ భక్తులు కొవ్వొత్తులు వెలిగించి, ప్రత్యేక ప్రార్థనలు చేసి వేడుక చేసుకున్నారు.
2/17
3/17
కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారు.. గోపాలకృష్ణుడి అలంకారంలో పిల్లనగ్రోవి ధరించి చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది.
4/17
విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని రాజు గారి తోటలో కార్తిక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వీరంతా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆటల పోటీల్లో పాల్గొని సందడి చేశారు.
5/17
ఫార్ములా కార్ రేసింగ్ను పలువురు తెలుగుతల్లి వంతెనపై నుంచి వీక్షిస్తుండటంతో భారీగా ట్రాఫిక్ నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు వంతెనపై రేసింగ్ కనిపించకుండా తెరను అడ్డుగా కట్టారు. రేసింగ్ ముగిసిన అనంతరం తిరిగి దాన్ని తొలగించారు. మరోవైపు సమయాభావం కారణంగా ఆదివారం అర్ధాంతరంగా రేసింగ్ను ఆపేశారు.
6/17
హాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా భావించే గవర్నర్స్ అవార్డు ప్రదానోత్సవంలో రాజమౌళి పాల్గొన్నారు. లాస్ ఏంజెలెస్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జక్కన్న.. స్టార్ వార్స్, మిషన్ ఇంపాజిబుల్ సినిమాల దర్శకుడు జేజే అబ్రమ్స్ను కలిశారు. ఈ సందర్భంగా తాను ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు పెద్ద ఫ్యాన్ అని జేజే అబ్రమ్స్ చెప్పడం విశేషం.
7/17
తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కళాకారులతో కలిసి మంత్రి రోజా స్టెప్పులేసి సందడి చేశారు.
8/17
అడివి శేష్ కథానాయకుడిగా శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా ‘హిట్2’. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని సోమవారం ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘హిట్2’ డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది..
9/17
తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో ప్రారంభించారు. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
10/17
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ డాబా గార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ మహా సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, సినీనటుడు ఆర్.నారాయణమూర్తి పాల్గొన్నారు.
11/17
చిరంజీవి హీరోగా బాబీ (కేఎస్ రవీంద్ర) తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‘ ‘బాస్ పార్టీ’ పాటను నవంబర్ 23న సాయంత్రం 4.05గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
12/17
కాకినాడలోని జేఎన్టీయూ ఆవరణలో పాఠశాల విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశంతో రాష్ట్రస్థాయి క్రియ పండగ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు వివిధ వేషధారణల్లో కనిపించి ఆకట్టుకున్నారు.
13/17
అన్నమయ్య డ్యామ్ జల విలయానికి గురైన పులపుత్తూరు గ్రామంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటించి బాధితులను పరామర్శించారు. డ్యామ్ కొట్టుకుపోయి ఏడాది అయినా ముంపు గ్రామాల ప్రజలకు నేటికీ సరైన సాయం అందలేదని ఆయన అన్నారు.
14/17
నైజీరియాలోని సాంగోటెడోలో వినూత్నంగా ‘ట్రాషన్ షో’ నిర్వహించారు. వార్తా పత్రికలు, నీటి సీసాలు, స్ట్రాలు, వివిధ రకాల వస్తువులకు వచ్చిన కవర్లతో రూపొందించిన దుస్తులు ధరించి ర్యాంప్ వాక్తో ఆకట్టుకున్నారు.
15/17
యువ కథానాయకుడు నాగశౌర్య వివాహం వేడుకగా జరిగింది. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి మెడలో అతడు మూడు ముళ్లు వేశాడు. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు.
16/17
గుజరాత్లోని ప్రసిద్ధ సోమనాథ్ దేవాలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ దర్శించుకున్నారు. ఆలయంలోని మూలవిరాట్కు అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
17/17
కార్తిక మాసం.. ఆదివారం కావడంతో నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే మల్లన్న స్వామిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో దుకాణ సముదాయాలు సందడిగా కనిపించాయి.