పనసపొట్టు బిర్యానీ

పనసముక్కలు - అరకేజీ, పెరుగు, 150 గ్రా., అల్లంవెల్లుల్లి పేస్టు- రెండు టేబుల్‌స్పూన్లు, కారం- టేబుల్‌స్పూన్‌, పసుపు- పావు టీస్పూన్‌...

Published : 11 Apr 2021 00:37 IST

పాఠక వంట

కావాల్సినవి: పనసముక్కలు - అరకేజీ, పెరుగు, 150 గ్రా., అల్లంవెల్లుల్లి పేస్టు- రెండు టేబుల్‌స్పూన్లు, కారం- టేబుల్‌స్పూన్‌, పసుపు- పావు టీస్పూన్‌, గరంమసాలా పొడి- రెండు టీస్పూన్లు, నిమ్మకాయ- ఒకటి, ఉప్పు- రుచికి సరిపడా. బిర్యానీ కోసం: బాస్మతీ బియ్యం- అరకేజీ, పొడవుగా కోసిన ఉల్లిపాయలు- మూడు, దాల్చినచెక్క- చిన్నముక్క, యాలకులు- నాలుగు, సాజీర- అర టీస్పూన్‌, లవంగాలు- పది, నల్ల యాలకులు- మూడు, బిర్యానీఆకు- ఒకటి, కొత్తమీర, పుదీనా తరుగు- కొద్దిగా, చీల్చిన పచ్చిమిర్చి- నాలుగు, ఉప్పు- సరిపడా, వేయించిన జీడిపప్పు- గుప్పెడు.
తయారీ: చేతులకు నూనె రాసుకుని పనసకాయ చెక్కు తీసి అంగుళం సైజు ముక్కల్లా కోసుకోవాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో పావుకప్పు నీళ్లు పోసి రెండు, మూడు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించాలి. వీటిని గిన్నెలో వేసి అల్లంవెల్లుల్లి పేస్టు, పెరుగు, గరంమసాలాపొడి, కారం, పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి పావుగంటపాటు నానబెట్టాలి. కడాయిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలను గోధుమ రంగులోకి వచ్చేంతవరకు వేయించాలి. పెద్ద పాత్రలో నీళ్లు మరిగించి నానబెట్టిన బియ్యం, మసాలాలు, ఉప్పు వేసి ఉడికించాలి. ముప్పావువంతు ఉడికిన తర్వాత అన్నాన్ని వార్చాలి. వెడల్పాటి పాత్రలో నెయ్యి రాసి వేయించిన ఉల్లిపాయముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగు వేయాలి. తర్వాత నానబెట్టి పనసముక్కలు, అన్నం పరచాలి. నెయ్యి, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి అల్యూమినియం ఫాయిల్‌తో పైభాగాన్ని మూసేయాలి. దీన్ని స్టవ్‌ మీద పెట్టి ఇరవై నిమిషాలు దమ్‌ చేయాలి. తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి మరో పది నిమిషాలపాటు ఉంచాలి. చివరగా వేయించిన జీడిపప్పు, కొత్తమీర తరుగు చల్లాలి.

- సౌజన్య, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని