ఈ-వ్యర్థాలకు కొత్త అర్థం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. రిమోట్‌ బొమ్మలు పాడైపోగానే పక్కన పడేస్తాం కదా! సెల్‌ఫోన్‌, ట్యాబ్‌,  కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ పనిచేయకపోతే.. వెంటనే మార్చేస్తాం. ఇలా ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలన్నీ(ఈ-వ్యర్థాలు)

Published : 07 May 2022 00:27 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. రిమోట్‌ బొమ్మలు పాడైపోగానే పక్కన పడేస్తాం కదా! సెల్‌ఫోన్‌, ట్యాబ్‌,  కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ పనిచేయకపోతే.. వెంటనే మార్చేస్తాం. ఇలా ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలన్నీ(ఈ-వ్యర్థాలు) పోగుపడుతూ పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అలాంటి వాటిని సేకరిస్తూ.. రీసైక్లింగ్‌ చేశాక.. పేద పిల్లలకు అందిస్తున్నాడో నేస్తం. ఆ వివరాలు చదివేయండి మరి..

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు చెందిన ప్రణవ్‌.. ఇటీవల కొన్ని పాడైపోయిన ల్యాప్‌టాప్‌లు సేకరించాడు. వాటిని బాగుచేయించి.. మూడు అనాథాశ్రమాలకు అందించాడు. ఆ ఆశ్రమాల్లోని చిన్నారులకు అండగా నిలిచాడు.

సొంతంగా సేకరిస్తూ...
ప్రణవ్‌ కొన్నాళ్లుగా 1ఎం1బీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఫ్యూచర్‌ లీడర్స్‌ ప్రోగ్రాంలో వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టాడు. పర్యావరణానికి హాని కలిగించే ఈ-వేస్ట్‌ను సేకరించి, మళ్లీ వినియోగించుకునేలా చేయడమే ఈ నేస్తం ప్రయత్నం. దీనికోసం ఇప్పటివరకూ రెండుసార్లు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాడు. బెంగళూరు శివారులోని రెండు పెద్ద పెద్ద గేటెడ్‌ కమ్యూనిటీల నుంచి దాదాపు 100 కేజీల ఈ-వ్యర్థాలను సేకరించాడు. తరవాత వాటిని ప్రభుత్వం నిర్వహించే రీసైక్లింగ్‌ ప్లాంట్‌కు తరలించాడు.

పేద పిల్లల కష్టాలు చూసి...
లాక్‌డౌన్‌ సమయంలో పాఠశాలలు మూతబడిన విషయం తెలిసిందే. దాంతో పేద పిల్లలు చదువులకు దూరమయ్యారు. స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేయలేక.. చాలామంది ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరుకాలేకపోవడం ప్రణవ్‌ని ఆలోచనలో పడేసింది. అప్పుడే, ఈ-వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి.. పేద పిల్లలకు ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నాడు. దీనివల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని తగ్గించడంతోపాటు విద్యార్థులకూ ఉపయోగకరంగా ఉంటుందని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారూ సరేనన్నారు.

కార్పొరేట్‌ సంస్థల నుంచి..
చిన్నతనం నుంచే ప్రణవ్‌ సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడని తల్లి మినాల్‌ చెబుతున్నారు. కార్పొరేట్‌ సంస్థల్లో తరచూ కంప్యూటర్లు మారుస్తుంటారనీ, ఈ క్రమంలో పాతవి చెతకుప్పల్లోకి చేరకుండా.. వాటిని సేకరించి.. రీసైక్లింగ్‌ చేయాలనేది ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని చెబుతున్నాడీ నేస్తం. అంతేకాదు.. ఇప్పటికే కొన్ని సంస్థల ప్రతినిధులను కలిసి.. తన ఆలోచనలను పంచుకోవడంతో వారూ ముందుకొచ్చి, ప్రణవ్‌ను అభినందించారు. నిజంగా ఈ నేస్తం గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని