తదుపరి గమ్యం తూర్పు.. ఉత్తరం

రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా రంగాల్లో వృద్ధితో  రియల్‌ఎస్టేట్‌ రంగం గణనీయంగా పుంజుకుంది

Updated : 11 Mar 2023 10:33 IST

4 దశలుగా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ను విశ్లేషించిన సావిల్స్‌ రీసెర్చ్‌ ఇండియా
ఈనాడు, హైదరాబాద్‌

రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా రంగాల్లో వృద్ధితో  రియల్‌ఎస్టేట్‌ రంగం గణనీయంగా పుంజుకుంది. 2000 సంవత్సరంలో సెంట్రల్‌ హైదరాబాద్‌ నుంచి మొదలైన రియల్‌ ప్రయాణం 2010 వరకు పశ్చిమ హైదరాబాద్‌లో వేళ్లూనుకుని 2015 నుంచి దక్షిణం వైపు విస్తరిస్తూ భవిష్యత్తులో ఉత్తరం, తూర్పు హైదరాబాద్‌ వైపు రియల్‌ ఎస్టేట్‌ ప్రయాణం సాగుతుందని అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సావిల్స్‌ అంచనా వేస్తోంది. ‘హైదరాబాద్‌: ది స్ప్రింట్‌’ పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదికలో పలు విషయాలను పేర్కొంది.

సెంట్రల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ప్రాంతాలతో..  ఐటీ సంస్థల రాకతో..

* మొదటిదశలో 2000 సంవత్సరం వరకు సెంట్రల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సీబీడీ) ప్రాంతాలైన బేగంపేట, అమీర్‌పేట, జూబ్లీహిల్స్‌ చుట్టుపక్కల నిర్మాణ రంగం కార్యకలాపాలు మొదలయ్యాయి.బీ హైదరాబాద్‌కు ఐటీ సంస్థల రాకతో పరిశ్రమ నిలదొక్కుకోవడంతో 2000-2010 మధ్య నాటికే పశ్చిమ హైదరాబాద్‌లో హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు చుట్టుపక్కలకు రియల్‌ ఎస్టేట్‌ గమనం మారింది. బీ శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం మొదలై అక్కడ కార్యకలాపాలు ఊపందుకోవడంతో 2015 నుంచి రియల్‌ ఇటువైపు విస్తరించడం మొదలైంది. ఇకముందు రియల్‌ఎస్టేట్‌ గమనం ఎటువైపు ఉంటుందనేది చాలామందిలో కుతూహలం కలిగించే విషయం.

ఇళ్ల మార్కెట్‌లోనూ..

కార్యాలయ స్థలాల్లోనే కాదు గృహ నిర్మాణ మార్కెట్‌ సైతం హైదరాబాద్‌లో పెరుగుతూనే ఉంది. ఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే ఇక్కడ ధరలు 10-20 శాతం తక్కువ ఉండటమే ఇందుకు కారణం. మౌలిక వసతులు మెరుగుపర్చడంతో శివార్ల వరకు నిర్మాణాలు విస్తరించాయి. ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, తెల్లాపూర్‌, శంషాబాద్‌, మేడ్చల్‌ వైపు గృహాలు విస్తరిస్తున్నాయి.

డేటా కేంద్రాలకు చిరునామాగా..

- తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి లీజింగ్‌ కార్యకలాపాల్లో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉంది. - ఎనిమిదేళ్లలో 2022లో అత్యధిక గృహాల విక్రయాలు జరిగాయి. - రిటైల్‌ విభాగంలో 2018 నుంచి వార్షిక సరఫరా అదనంగా పెరిగింది. 2022లోనే సుమారు 1 మిలియన్‌ చదరపు అడుగుల సరఫరా జతకూడింది. 2022 డిసెంబరు నాటికి దేశంలోని మొత్తం సరఫరాలో హైదరాబాద్‌ 8 శాతం వాటా కలిగి ఉంది.  - రియల్‌ఎస్టేట్‌లో కొత్త ఉప విభాగంగా డేటా కేంద్రాలు పెట్టుబడివారులకు ఇష్టమైన అసెట్‌క్లాస్‌గా ఉద్భవించాయి. వీటికి హైదరాబాద్‌ కేంద్రంగా మారుతోంది. గత ఏడాది 500 ఎకరాల డేటా కేంద్రానికి సంబంధించిన భూ లావాదేవీల్లో 26 శాతం హైదరాబాద్‌లోనే జరిగాయి.

రవాణా ఆధారంగా...

* నగర విస్తరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు రవాణా ఆధారిత అభివృద్ధి(టీవోడీ)తో ప్రజారవాణా ఉన్న ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగింపునకు అవకాశం ఉంది.  
* ఈ విధానంలో శంషాబాద్‌ విమానాశ్రయం ఉన్న హైదరాబాద్‌ దక్షిణం వైపు మెట్రోతో ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
* జీవ శాస్త్రాలు, డేటా కేంద్రాలు, ఈవీ మొబిలిటీ వ్యాలీలు, ఏరోస్పేస్‌ వంటి రంగాలకు ప్రోత్సాహంతో ఉపాధి అవకాశాలు పెరిగి తద్వారా రియాల్టీకి ఊతం రానుంది.

హైబ్రిడ్‌ పనితో..

కొవిడ్‌ తర్వాత కార్యాలయాల పనితీరులో చాలా మార్పులు వచ్చాయి. వారంలో కొన్నిరోజులే ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారు. దీంతో ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌పై ఐటీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. 2020-22 మధ్యలో హైదరాబాద్‌లో 2.3 మిలియన్‌ చదరపు అడుగుల ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ను ఐటీ సంస్థలు లీజుకు తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్‌ వాటా 15 శాతంగా ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే అద్దెలు తక్కువగా ఉండటంతో ఈ మార్కెట్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది.


శాటిలైట్‌ నగరాలను ప్రోత్సహించాలి
- జి.వి.రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌(టీడీఏ)తి

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ అన్నివైపులా వృద్ధికి అవకాశం ఉంది. ఒక్కో ప్రాంతం ఒక్కో వర్గాన్ని ఆకర్షిస్తుంది. రెండు రకాల మార్కెట్లు ప్రధానంగా ఉన్నాయి.


తూర్పు వైపు.. మధ్యతరగతి గృహ నిర్మాణాల మార్కెట్‌గా మరింతగా అభివృద్ధి చెందనుంది.

పడమర వైపు.. జూబ్లీహిల్స్‌కు కొనసాగింపుగా ఉన్న ఐటీ కారిడార్‌ కొల్లూరు వైపు విస్తరణ ఉంటుంది. ప్రీమియం రెసిడెన్షియల్‌ మార్కెట్‌గా ఈ ప్రాంతాన్ని చెప్పుకోవచ్చు.

దక్షిణం వైపు.. విమానాశ్రయం ఉండటంతో శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు పరిశ్రమల కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. చందన్‌వల్లి ప్రాంతంలో పరిశ్రమలు వస్తున్నాయి. విమానాశ్రయంతో రవాణాకు అనుకూలంగా ఉంటుంది.

ఉత్తరం వైపు.. హైదరాబాద్‌ మొదటి నుంచీ స్వయం సంవృద్ధి ప్రాంతంగా ఉంది. ఇక్కడ వేర్‌హౌసింగ్‌, జీవశాస్త్రాల రంగం మరింతగా విస్తరించింది. ప్రభుత్వం ఇక్కడ మౌలిక వసతులు మరింతగా కల్పించకల్గితే వృద్ధికి ఢోకా ఉండదు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఇక్కడ ఆవాసం ఉంటున్నాయి. జీవో 111 పరిధిలో జంట జలాశయాలు కాలుష్యం బారిన పడకుండా గ్రీన్‌ జోన్‌గా సమగ్ర ప్రణాళికను సర్కారు తీసుకొస్తే ఈప్రాంతం జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఐటీ ఉద్యోగులకు నిలయంగా మారనుంది.

* శివార్లలో మున్సిపాలిటీలతో స్వయం సమృద్ధి సాధ్యం కాదు. 10-15 లక్షల జనాభాకు నివాసం ఉండే ప్రాంతాలను శాటిలైట్‌ నగరాలుగా అభివృద్ధి చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని