వేడి వేడి పులావ్‌ వడ్డించండి!

ఈ కాలంలో అన్నం, పప్పు, కూర... వంటివన్నీ వండుకుని తినడం కన్నా రకరకాల కూరగాయ ముక్కలన్నీ కలిపి ఏదో ఒక రైస్‌ చేసుకుని వేడివేడిగా తినాలనుకోవడం మామూలే. అలాగని రోజూ బిర్యానీ చేసుకోలేం... కిచిడీలూ వండుకోలేం. అందుకే కుదిరినప్పుడల్లా ఇలాంటి పులావ్‌లు వండుకుంటే సరి.

Published : 26 Jun 2021 09:34 IST

ఈ కాలంలో అన్నం, పప్పు, కూర... వంటివన్నీ వండుకుని తినడం కన్నా రకరకాల కూరగాయ ముక్కలన్నీ కలిపి ఏదో ఒక రైస్‌ చేసుకుని వేడివేడిగా తినాలనుకోవడం మామూలే. అలాగని రోజూ బిర్యానీ చేసుకోలేం... కిచిడీలూ వండుకోలేం. అందుకే కుదిరినప్పుడల్లా ఇలాంటి పులావ్‌లు వండుకుంటే సరి.

కొబ్బరిపాలతో...

కావలసినవి బాస్మతి బియ్యం: కప్పు (నానబెట్టుకోవాలి), ఆలూ, బీన్స్‌, క్యారెట్‌, బఠాణీ: అన్నీ కలిపి ఒకటిన్నర కప్పు, పుదీనా తరుగు: అరకప్పు, కొబ్బరి తురుము: అరకప్పు, కారం: చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, గరంమసాలా: చెంచా, మిరియాలపొడి: చెంచా, కొబ్బరిపాలు: పావుకప్పు, నెయ్యి: టేబుల్‌స్పూను, బిర్యానీఆకులు: రెండు, ఉప్పు: తగినంత.
తయారీవిధానం: కూరగాయ ముక్కలపైన కొబ్బరి తురుము, పుదీనా తరుగు, తగినంత ఉప్పు, కొబ్బరిపాలు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, గరం మసాలా, మిరియాలపొడి వేసి అన్నింటినీ కలిపి పెట్టుకోవాలి. స్టౌమీద కుక్కర్‌ పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక బిర్యానీఆకులు వేయించి... కూరగాయముక్కలు వేసి అన్నింటినీ వేయించి పైన పావుగంటసేపు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. రెండు కూతలు వచ్చాక దింపేయాలి.  

పాలక్‌ సాంబార్‌ రైస్‌

కావలసినవి పాలకూర తరుగు: ఒకటిన్నర కప్పు, అన్నం: రెండు కప్పులు, జీలకర్ర: చెంచా, అల్లం తరుగు: చెంచా, టొమాటో గుజ్జు: రెండు చెంచాలు, పసుపు: అరచెంచా, సాంబార్‌పొడి: ఒకటిన్నర చెంచా, గరంమసాలా: చెంచా, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత.
తయారీవిధానం: స్టౌమీద బాణలి పెట్టి నెయ్యి వేసి జీలకర్ర, అల్లం తరుగు వేయించాలి. తరువాత టొమాటో గుజ్జు, పసుపు వేయించి పాలకూర తరుగు, తగినంత ఉప్పు వేయాలి. పాలకూర బాగా వేగాక అన్నం, సాంబార్‌పొడి, గరంమసాలా వేసి స్టౌని సిమ్‌లో పెట్టి... బాగా కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.

దహీ పనీర్‌ పులావ్‌

కావలసినవి పనీర్‌ ముక్కలు: కప్పు, పెరుగు: పావుకప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద: మూడు చెంచాలు, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, బాస్మతిబియ్యం: కప్పు (నానబెట్టుకోవాలి), నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, దాల్చిన చెక్క: ఒక ముక్క, లవంగాలు: రెండు, యాలకులు: మూడు, బిర్యానీ ఆకులు: రెండు, జీలకర్ర: అరచెంచా, ఉల్లిపాయ: ఒకటి, టొమాటో గుజ్జు: చెంచా, నీళ్లు: ఒకటిన్నర కప్పు, కొత్తిమీర తరుగు: టేబుల్‌స్పూను, నూనె: రెండు చెంచాలు, జీడిపప్పు: ఆరు.
తయారీవిధానం: ఓ గిన్నెలో పనీర్‌ ముక్కలు, పెరుగు, రెండు చెంచాల అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, అరచెంచా ఉప్పు వేసి అన్నింటినీ కలిపి పెట్టుకోవాలి. కుక్కర్‌లో నెయ్యి వేసి దాల్చినచెక్క, లవంగాలు, బిర్యానీఆకులు, యాలకులు, జీలకర్ర వేయించి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి కూడా ఎర్రగా వేగాక మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో గుజ్జు వేసి అన్నింటినీ కలపాలి. నిమిషం తరువాత పనీర్‌ ముక్కలు, కడిగిన బియ్యం వేసి బాగా కలిపి ఒకటిన్నర కప్పు నీళ్లు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టాలి. అన్నం పూర్తిగా ఉడికాక దింపేయాలి. స్టౌమీద బాణలి పెట్టి నూనె వేసి, జీడిపప్పు వేయించి అన్నంపైన వేసి, కొత్తిమీర అలంకరిస్తే సరిపోతుంది.

బేబీ ఆలూ పులావ్‌

కావలసినవి బాస్మతి బియ్యం: ఒకటిన్నర కప్పు (నానబెట్టు కోవాలి), బేబీ ఆలూ: పది, ఉల్లిపాయ: ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్‌స్పూన్లు, పెరుగు: అరకప్పు, కారం: చెంచా, దనియాలపొడి: రెండు చెంచాలు, గరంమసాలా: చెంచా, పుదీనా తరుగు: పావుకప్పు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, పచ్చిమిర్చి: రెండు,
అనాస పువ్వు: ఒకటి, బిర్యానీ ఆకు: ఒకటి, లవంగాలు: నాలుగు, యాలకులు: రెండు, దాల్చిన చెక్క: ఒకటి, నిమ్మరసం: టేబుల్‌స్పూను, నెయ్యి: మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత.

తయారీవిధానం ముందుగా బంగాళాదుంపల చెక్కు తీసి నీటిలో వేసి పెట్టుకోవాలి. అదే విధంగా పెరుగులో కారం, దనియాలపొడి, గరంమసాలా వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి ఒకటిన్నర టేబుల్‌స్పూన్ల నెయ్యి వేయాలి. అది వేడెక్కాక బంగాళాదుంపల్ని వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేసి అనాసపువ్వు, బిర్యానీఆకు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేసి వేయించి.. ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి ఎర్రగా వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద వేయించి, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి వేసి... పెరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి అన్నింటినీ కలపాలి. రెండు నిమిషాలయ్యాక బియ్యం, వేయించిన బేబీ ఆలు, రెండున్నర కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి మూత పెట్టాలి. అన్నం పూర్తిగా ఉడికాక దింపేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని