Kartika Purnima: కార్తిక మాసంలో 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు?

Updated : 26 Nov 2023 20:59 IST

దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపాన్ని వెలిగిస్తారు. దేవీదేవతల ముందు దీపం వెలిగించడమే దీపారాధన. దేవుడిని పూజించడం కంటే ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తాం. షోడశోపచారాల్లో దీపారాధన ప్రధానమైంది. (karthika masam 2023) అన్ని ఉపచారాలూ చేయలేకపోయినా ధూపం, దీపం, నైవేద్యాలను తప్పక చేయాలంటారు పెద్దలు.

 దేవతలకూ వాహకంగా నిలిచే అగ్ని సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపం కూడా. అందుకే దీపాన్ని అర్చించిన వారికి లక్ష్మీకటాక్షం తప్పక లభిస్తుందంటారు. ఎన్నో విశిష్టతలకు నెలవైన దీపానికి కార్తిక మాసంలో మరింత ప్రత్యేకత ఉంది. అంతేకాదు దీపాన్ని ఎలా ఆరాధించాలి? దీపారాధన సమయంలో ఎలాంటి నియమనిబంధనలు పాటించాలి? తదితర అంశాలను కూడా శాస్త్రాల్లో నిక్షిప్తం చేశారు మన పెద్దలు.

సాధారణంగా మూడు అడ్డ వత్తులు లేదా బొడ్డు వత్తులను చేసి, ప్రమిదలో ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వీటిని వెలిగిస్తారు. ప్రత్యేక పూజలూ నోములూ చేసేటప్పుడు అయిదు పోగులూ, తొమ్మిది పోగులూ, కమలవత్తుల పేరుతో ఎనిమిది పోగులూ... ఇలా రకరకాలుగా వత్తులను వెలిగిస్తారు. సాధారణంగా దీపారాధన సమయంలో కింది శ్లోకాన్ని చదువుతారు.

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం |
గృహాణ మంగళం దీపం త్రైలోక్యతి మిరాపహా||
భక్త్యా దీపం ప్రయాచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాంనర కాద్ఘోరా ద్దివ్యజ్యోతి ర్నమోస్తుతే ||

మూడు వత్తులను తీసుకుని, తైలంలో తడిపి, అగ్నిని జతచేసి శుభప్రదమైన, మూడులోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించి, పరమాత్మకు భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకం నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను అని రోజూ దీపానికి నమస్కరిస్తాం.

చిన్న దీపం పెట్టి అది నా ఇంటినే కాదు ముల్లోకాల్లోనూ వెలుగు నింపాలన్నది ఎంత గొప్ప భావన! మరెంతటి ఉదాత్తమైన ఆలోచన! దీపంలో ఉపయోగించిన మూడు వత్తులు ముల్లోకాలకీ, సత్వ రజ తమోగుణాలకూ, త్రిమూర్తులకు, త్రిసంధ్యలకూ సంకేతంగా భావిస్తారు. పూజలో చేసే దీపారాధనకే కాదు సంధ్యా దీపానికీ ఉన్నతమైన స్థానాన్ని కల్పించింది సనాతన ధర్మం.

లోకానికి వెలుగునీ తేజస్సునీ ప్రసాదించే సూర్యుడు జీవులమీద దయతో వారికి జీవాన్నీ, శక్తినీ ప్రసాదించడానికి తాను అస్తమిస్తూ ఆ తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట. అందుకే సర్వప్రాణులకూ ప్రాణప్రదాత అయిన సూర్యుడి అస్తమయం కంటే ముందుగానే ఇంట్లో సంధ్యా దీపం పెట్టే సంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పెద్దలు. తిరిగి సూర్యోదయం వరకూ దీపాన్ని వెలుగుతూ ఉంచడం మన సంస్కృతిలో ఒక భాగమే.

దీపం ముమ్మూర్తులా పరబ్రహ్మ స్వరూపమే. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం. అంధకారమంటే... కేవలం చీకటి మాత్రమే కాదు. మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే! ఆ చీకట్లను పటాపంచలు చేసి, జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి. అందుకే లోకంలో లక్ష్మీస్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి. (Karthika masam) దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయిందన్నదానికీ ఒక కథ ఉంది. పూర్వం ఇంద్రుడు దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనై సకల సంపదలూ కోల్పోతాడు. అప్పుడు దిక్కుతోచక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇచ్చాడట. ఇంద్రుడు అలా భక్తితో పూజించి తిరిగి తన సంపదలను పొందాడనీ అప్పటినుంచే లక్ష్మీ దేవి దీపలక్ష్మీదేవి అయిందనీ చెబుతారు.

కార్తిక మాసంలో 365 వత్తుల దీపం ఎందుకంటే?

దీపం మనలోని తమస్సును పోగొడుతుంది. కాబట్టి తమసోమా జ్యోతిర్గమయా!అని రుషులు ప్రార్థించారు. అజ్ఞానం పోగొట్టి జ్ఞానదీప్తి కలిగించే ఈ దీపాన్ని కార్తికమాసంలో వెలిగిస్తే విశేష ఫలితాలు ఉంటాయంటారు. కృత్తికా నక్షత్ర ప్రాధాన్యం ఉన్న కార్తిక మాసంఅగ్ని ఆరాధనకు ముఖ్యమైంది. కృత్తిక అంటే అగ్ని. ఆ అగ్నిని యజ్ఞం ద్వారా ఆరాధిస్తాం. ఏ దేవతకైనా హవ్యాలు అగ్ని ద్వారానే సమర్పిస్తాం. ఆ అగ్నికి సూక్ష్మరూపమే దీపం. దీపం జీవగతమైంది. ప్రత్యక్ష దైవాల్లో ఒక్కటైన అగ్నిని దీపరూపంలో ఆరాధించడమంటే పరోక్షంగా ఆ పరబ్రహ్మానికి కృతజ్ఞతలు చెప్పడమేకాదు సమస్త ప్రాణకోటికీ లబ్ధి చేకూర్చడమేనని చెబుతారు.

కార్తిక పురాణం ప్రకారం... కార్తిక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వల్ల సంతానాన్ని పొందాడనీ, వారికి కుమారుడైన శత్రుజిత్తు కార్తిక మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల కైలాసాన్ని చేరుకున్నాడనీచెబుతారు. కార్తిక మాసం (Karthika masam) మొత్తం రెండు సంధ్యల్లోనూ దీపారాధన చేస్తుంటారు. అయితే ఇందులో సాయం సంధ్యా దీపం మరింత విశిష్టమైంది. సాయంత్ర వేళల్లో శివాలయంలో కానీ, వైష్ణవాలయంలోకానీ దీపాన్ని వెలిగిస్తే మంచిదంటారు. ఆలయ ద్వారం, గోపురం, గర్భగుడిలో ధ్వజస్తంభం దగ్గర... ఇలా ఎక్కడ దీపాన్ని వెలిగించినా పుణ్యమే. గుడిలో దీపాలను వెలిగించడం కుదరనివారు ఇంట్లో పూజామందిరంలో కానీ, తులసికోట దగ్గర కానీ దీపారాధన చేస్తూ ఉంటారు. వీటితోపాటు రావి, ఉసిరి లాంటి దేవతావృక్షాల కింద, నదీ తీరాల్లో దీపారాధన చేసినా విశేష ఫలితం లభిస్తుందన్నది పెద్దల మాట.

ఒక్కరోజైనా...

కార్తిక మాసమనే కాదు నిత్యం ఆ పరమాత్మకు దీపారాధన చేయడం తప్పనిసరి అంటుంది శాస్త్రం. అలా నిత్యదీపారాధన కుదరకపోతే కార్తికమాసం మొత్తమైనా, అదీ కుదరకపోతే కార్తిక సోమవారాలూ, శుద్ధ ద్వాదశీ, చతుర్దశీ, పౌర్ణమి లాంటి (kartika purnima 2023) తిథుల్లోనైనా దీపాలను వెలిగించమని చెబుతారు. ఇది కూడా సాధ్యం కానివారు కనీసం కార్తిక పౌర్ణమి రోజైనా 365 వత్తులు ఉన్న గుత్తి దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడవునా దీపాలు వెలిగించినంత పుణ్యం ప్రాప్తిస్తుందని చెబుతారు. ఆవునేతితో దీపం పెట్టడం అన్నింటికన్నా శ్రేష్టం. అలాగే నువ్వుల నూనెనూ ఉపయోగించవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని