కుంభకర్ణుడి నిద్రకు కారణం ఏంటి?

ఎంత లేపినా నిద్ర లేవకపోతే కుంభ కర్ణుడిలా నిద్ర ఏంటి? అని అంటాం. అసలు కుంభ కర్ణుడు అంతలా నిద్రపోవటానికి కారణం ఏంటి? అసలేం

Updated : 14 Mar 2023 16:23 IST

ఎంత లేపినా నిద్ర లేవకపోతే కుంభ కర్ణుడిలా నిద్ర ఏంటి? అని అంటాం. అసలు కుంభ కర్ణుడు అంతలా నిద్రపోవటానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? కైకసి పుత్రులైన రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మదేవుణ్ని సంతోషపెట్టి వరాలు పొందాలని ఘోరమైన తపస్సు ప్రారంభిస్తారు. రావణుడు వెయ్యి సంవత్సరాల తపస్సు పూర్తికాగానే ఒక తలను పూర్ణాహుతి కావిస్తూ పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తన పదో తలను కూడా ఆహుతి చేయబోతుండగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటాడు. తనకు మరణం లేని వరం ప్రసాదించమంటాడు. అలాంటి వరం ప్రసాదించడం అసాధ్యమంటూ మరేమైనా కోరుకొమ్మంటాడు బ్రహ్మ. మానవులు తనకు గడ్డిపరకల వంటివారని, కనుక దేవతలు, గరుడ, గంధర్వ, పన్నగ, యక్షుల చేతిలో చావు లేకుండా వరం కోరుకుంటాడు రావణుడు. అలాగేనని అనుగ్రహించిన బ్రహ్మ రావణుడు బలి ఇచ్చిన తొమ్మిది తలలు తిరిగి పుట్టేలా కూడా వరం ఇస్తాడు.

కుంభకర్ణుడు గ్రీష్మ రుతువులో అగ్ని మధ్య నిలబడి, వర్షరుతువులో వానలో తడుస్తూ, శిశిరరుతువులో నీటి నడుమ నిలబడి పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి పరమేష్టి వరమీయ సంకల్పించగానే- అతడికి వరాలు ప్రసాదించవద్దని దేవతలు అడ్డుపడతారు. సరస్వతీదేవిని కుంభకర్ణుడి నాలుకపై ప్రవేశపెట్టి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే- నిర్దయ బదులు సరస్వతీదేవి ప్రేరణతో నిద్దుర కావాలంటాడు కుంభకర్ణుడు. తథాస్తు అంటాడు కమలాసనుడు.

విభీషణుడు ఒంటికాలిపై నిలబడి అయిదు వేల సంవత్సరాలు, సూర్యుడి గతిని అనుసరించి తిరుగుతూ మరో అయిదువేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ వరం  కోరుకొమ్మంటే విభీషణుడు కష్టాలు అనుభవిస్తున్న సమయంలోనూ తన బుద్ధి ధర్మమందే నిలిచి ఉండాలని, సర్వకాల సర్వావస్థల్లో తన బుద్ధి ధర్మమార్గాన్ని వీడిపోకుండా ఉండేలా అనుగ్రహించమని కోరతాడు. ముగ్గురు సోదరులు ఒకేసారి పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసినా వారి బుద్ధులను బట్టి వరాలు పొందగలిగారు. లోకాలను జయించి చిరంజీవి  కావాలనుకున్న రావణుడి కోరిక నెరవేరలేదు. కోరకుండానే చిరంజీవి కాగలిగాడు విభీషణుడు. కుంభకర్ణుడు శయన మందిరంలో నిద్రావస్థలో ఉండిపోయాడు. ఇది కుంభ కర్ణుడి నిద్ర వెనుక ఉన్న కారణం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని