కార్తిక మాసంలో ఈ ఉపవాసం ఎలా చేయాలంటే?

కార్తిక మాసంలో నక్తాలు ఉంటున్నాం అని కొందరంటుండటం వినిపిస్తుంటుంది. నక్తాలు ఉండటం అంటే ఉపవాసాలు ఉండటం అని అర్థం. ఉపవాసం

Updated : 14 Mar 2023 16:36 IST

కార్తిక మాసంలో నక్తాలు ఉంటున్నాం అని కొందరంటుండటం వినిపిస్తుంటుంది. నక్తాలు ఉండటం అంటే ఉపవాసాలు ఉండటం అని అర్థం. ఉపవాసం అనే దానికి.. రోజంతా ఏమి తినకుండా, మరునాడు భోజనం చేయాలా? ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి అనే సందేహాలు కలుగుతాయి. నక్తం అంటే రాత్రిపూట అని అర్థం. పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేయటాన్ని నక్తవ్రతమని, నక్త భోజనమని అంటారు. రాత్రిపూట తినమన్నారు కదా అని పది గంటలో, పదకొండు గంటలకో చేయకూడదు. సూర్యాస్తమయం అయి చుక్కలు కనిపించే సమయానికి చేయాలి. ఇలా చేయటం ఆరోగ్య ప్రదం. ఈ విధి విధానాన్ని తెలుసుకోకుండా ఇష్టానుసారం భోజనం చేస్తే అది వ్రత పుణ్యఫలాన్ని ఇవ్వకపోగా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే ప్రమాదముంది. అందుకే.. పెద్దల పర్యవేక్షణలో వ్రతాలను ఆచరించటం మేలు. ఈ వ్రతం కేవలం కార్తీకంలోనే కాదూ సంవత్సరంలో అన్ని మాసాలలోనూ, కొన్ని ప్రత్యేక తిథులలో ఆచరించటం ఆరోగ్యానికి క్షేమకరమని, పుణ్యప్రదమని తెలియచెబుతోంది లింగపురాణం.

పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రమే భోజనం చేసే ఈ వ్రతాన్ని ఎందుకాచరించాలి? అసలు ఉపవాసాలుంటూ ఏమీ తినకుండా ఉండేటప్పుడు ఎందుకు ఉద్యోగాలు చేయాలి, ధనాన్ని ఎందుకు సంపాదించాలి? అని కొందరికి కలిగే సందేహాలకు ఈ కథా సందర్భంలో సమాధానాలు దొరుకుతాయి. గృహస్తుడు అని అంటే తానొక్కడూ తిని కూర్చోకూడదు. అతడిమీద ఎన్నెన్నో జీవులు ఆధారపడి ఉంటాయి. వాటన్నింటికీ భోజనం పెట్టటం ద్వారా తృప్తి కలిగించాకే గృహస్తుడు తినాలి. దేవతలు ఉదయం పూట, ఋషులు మధ్యాహ్నవేళ, పితృదేవతలు అపరాహ్ణవేళ, గుహ్యకులు లాంటివారు సాయంసంధ్య సమయాలలో భోజనం చేస్తారు. అందుకని వారందరికీ వారి వారి సమయాలలో ఆహారాన్ని నివేదించి.. చుక్కలు కనిపించేటప్పుడు గృహస్తుడు తినాలి. గృహస్తుడిచ్చిన ఆహారం మీద పశు పక్ష్యాదులు, సూక్ష్మ జీవులు ఆధారపడుతుంటాయి. వాటన్నింటికీ ఆహారాన్ని ఇచ్చేందుకు మనిషి ధర్మబద్ధంగా సంపాదించాలి.

నక్తవ్రతం కేవలం ఒంటిపూట ఉపవాసంతోనే ముగియదు. ఆ సందర్భంగా కొన్ని కొన్ని దానాలు, ధర్మాలు చేయాల్సి ఉంటుంది. దీని వెనుక సర్వభూతదయ అనే సామాజికాంశం కనిపిస్తుంది. ప్రాతఃకాలస్నానం, భస్మ, రుద్రాక్ష ధారణ, భగవన్నామ స్మరణలు, ప్రణవ శివ షడక్షర మహామంత్ర జపాలు చేయాలి. మితంగా పెసరపప్పు, బియ్యం కలిపి వండిన అన్నాన్ని భుజించి, సత్య సంభాషణలు చేస్తూ చాపమీద పడుకోవాలి.

పుష్యమాసంలో ఈ వ్రతాన్ని చేస్తే నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఈ మాసంలో రెండు పక్షాలలో వచ్చే అష్టమి తిథులు, పూర్ణిమనాడు వ్రతంచేసి, ఆవునెయ్యితో రుద్రుడికి అభిషేకించాలి. ధాన్యాన్ని శివుడికి నివేదించటం, కపిల గోవును, ఎద్దును దానం ఇవ్వటం వల్ల ఆగ్నేయాది లోకాలు ప్రాప్తిస్తాయి. మాఘమాసంలో పెసరపప్పు, నెయ్యితో కూడిన భోజనాన్ని తినాలి. ఈ మాసంలోని చతుర్దశి, పౌర్ణమిలలో వ్రతం చేయొచ్చు. నెయ్యి, గొంగళి, నలుపురంగు ఆవు, ఎద్దులను దానం చేయటం వల్ల యమధర్మరాజు సంతుష్టుడవుతాడు. ఫాల్గుణ మాసంలో నెయ్యి, పాలతో వండిన పాయసాన్ని నివేదించాలి. చదుర్దశి, అష్టమి, పూర్ణిమలలో నక్తవ్రతం చేసి రుద్రాభిషేకాన్ని నిర్వహించాలి. గోమిధునాన్ని దానం చేసే వారికి చంద్రసాయిజ్యం లభిస్తుంది. చైత్రమాసంలో చేపడితే నిరుతిలోకం లభిస్తుంది. వైశాఖంలో వ్రతం చేసి తెల్లటి ఆవును, ఎద్దును దానమిస్తే అశ్వమేధ ఫలం దక్కుతుంది. జ్యేష్టమాసంలో నెయ్యి కలిపిన పదార్థం నివేదించి అర్ధరాత్రి వరకూ గోశాలలో గోవులకు సేవలు చేస్తూ ధూమ్రవర్ణంలో ఉన్న గోమిధునాన్ని దానం చేయాలి. ఆషాఢంలో చెరకు రసం నెయ్యి, పేలపిండి, ఆవుపాలను స్వీకరిస్తూ వ్రతాన్ని చేసే వారికి వరుణ లోక ప్రాప్తి కలుగుతుంది.

శ్రావణమాసంలో.. అరవై రోజులలో పంట కొచ్చిన వరి ధాన్యాన్ని శివుడికి నైవేద్యం పెట్టాలి. చిత్ర వర్ణాలున్న గోమిధుదాన్ని దానం ఇవ్వటం, పూర్ణిమనాడు ఆవునెయ్యితో శివుడిని అభిషేకించటం, అన్నదానం చేయటం వల్ల వాయు సాయిజ్యం లభిస్తుంది. ఆశ్వయుజంలో నల్లనిరంగులో ఉండే గోమిధుదాన్ని దానమివ్వాలి. పున్నమినాడు రుద్రాధ్యాయంతో శివుడిని అభిషేకించి పూజిస్తే ఈశానలోకం లభిస్తుంది. కార్తీక మాసంలో నెయ్యితో కూడిన క్షీరాన్నాన్ని నివేదించి కపిల గోమిధునాన్ని దానమివ్వటం, అన్నదానాలు చేస్తే సూర్యలోకార్హత పొందుతారు. మార్గశిరంలో నెయ్యి, పాలతో కూడిన యవధాన్యంతో వండిన అన్నాన్ని నివేదించటం, వేద పండితులకు, దరిద్రులకు, సత్పురుషులకు పున్నమినాడు శివాభిషేకం అయిన తర్వాత భోజనాలు పెట్టడం, తెలుపు రంగుగల గోమిధునాన్ని దానమివ్వటం వల్ల సోమలోక నివాస అర్హత లభిస్తుంది.

నక్తవ్రతం అన్నిమాసాల్లోనూ చేయవచ్చంటోంది లింగపురాణం. అహింస, సత్యం, దొంగతనానికి పాల్పడకుండా ఉండటం, బ్రహ్మచర్యం, ఓర్పు, దయ, ఉదయం, మధ్యాహ్నం సాయం కాలాలలో స్నానం చేయటం, ఇలాంటివన్నీ వ్రతం వల్ల ప్రాప్తించే మంచి అలవాట్లు. శుక్ల, కృష్ణ పక్షాలలో చతుర్దశి, అష్టమి తిథులలో ఈ వ్రతాన్ని ప్రతినెలా అందరూ చేస్తూ ఉంటే సమాజంలో అశాంతి అనేదే ఉండదు అని అంటోంది లింగపురాణం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని