అష్టమహాదానాలని వేటిని అంటారు?

సనాతన సంప్రదాయంలో అష్ట మహాదానాలకు విశిష్టమైన ప్రాధాన్యత వుంది. గరుడ పురాణం ఎనిమిదో అధ్యాయంలో ఈ దానాల గురించి చక్కగా వివరించారు. నువ్వులు...

Updated : 07 Feb 2019 19:59 IST

సనాతన సంప్రదాయంలో అష్ట మహాదానాలకు విశిష్టమైన ప్రాధాన్యత వుంది. గరుడ పురాణం ఎనిమిదో అధ్యాయంలో ఈ దానాల గురించి చక్కగా వివరించారు. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, భూమి, ఆవులను దానంగా ఇవ్వవచ్చు. ఇక ఎనిమిదో దానం కింద ఏడు ధాన్యాలను చేర్చారు. ఇందులో గోధుమలు, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, మినుములు, ఉలవలు వున్నాయి. వీటిలో ఏదైనా ఒకటిని లేదా అన్నింటినీ దానంగా ఇవ్వవచ్చు. నువ్వులు శ్రీ మహావిష్ణువు స్వేదం నుంచి ఉద్భవించాయి. నువ్వుల్లో మూడు రకాలుంటాయి. వీటిలో ఏది ఇచ్చినా ఉత్తమ ఫలితాలుంటాయి.

ఇనుమును దానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్లకుండా వుండవచ్చని శాస్త్రం తెలుపుతోంది. యముడు ఇనుముతో చేసిన ఆయుధాలు ధరించివుంటారు. దీంతో ఇనుము దానం చేసిన వారు యమలోకానికి వెళ్లరు. భూమిని దానం చేయడం ద్వారా సమస్తభూతాలు సంతృప్తి చెందుతాయి. సువర్ణదానం బ్రహ్మ, దేవతలు, మునీశ్వరులు సంతోషించేందుకు దోహదపడుతుంది. పత్తిని దానం చేయడం ద్వారా యమభటుల భ‌యం ఉండ‌దు. అలాగే ఉప్పును దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు. గోదానంతో వైతరిణి నదిని దాటిపోవచ్చు. ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలను దానం చేయడం ద్వారా యముడి నివాసానికి రక్షణగా వుండేవారు ఆనందిస్తారు. 

ఈ దానాల్లో కొన్నింటిని సామాన్యులు కూడా చేయవచ్చు. ఉప్పు, నువ్వులు, ధాన్యాలు, పత్తిని దానం చేయవచ్చు. లేనివానికి మనకున్నంతలో ఇవ్వడమే దానాల పరమార్థం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని