విశాఖ ఉక్కు కానిస్టేబుల్‌

పుట్టింది సామాన్య కుటుంబంలో...వృత్తి విధులతో తీరికలేని పోలీసు ఉద్యోగం...అయినా కఠినమైన ట్రయథ్లాన్‌ ఆటను ఎంచుకున్నాడు... అలుపెరుగకుండా శ్రమిస్తున్నాడు... గత నెలలో చైనాలోని చాంఘ్డ్‌ నగరంలో జరిగిన ‘ప్రపంచ పోలీసు, అగ్నిమాపక క్రీడోత్సవాల్లో’ ఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖ తరఫున పాల్గొన్నాడు. బంగారు పతకం సాధించాడు.  ఉక్కు మనిషిగా మన్ననలందుకున్నాడు...ఆ యువకుడే విశాఖ నగరానికి చెందిన పరవాడ కృష్ణ... అతడి విజయ ప్రస్థానం ‘ఈతరం’లో ఈ వారం....

Published : 07 Sep 2019 00:46 IST

పుట్టింది సామాన్య కుటుంబంలో...వృత్తి విధులతో తీరికలేని పోలీసు ఉద్యోగం...అయినా కఠినమైన ట్రయథ్లాన్‌ ఆటను ఎంచుకున్నాడు... అలుపెరుగకుండా శ్రమిస్తున్నాడు... గత నెలలో చైనాలోని చాంఘ్డ్‌ నగరంలో జరిగిన ‘ప్రపంచ పోలీసు, అగ్నిమాపక క్రీడోత్సవాల్లో’ ఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖ తరఫున పాల్గొన్నాడు. బంగారు పతకం సాధించాడు.  ఉక్కు మనిషిగా మన్ననలందుకున్నాడు...ఆ యువకుడే విశాఖ నగరానికి చెందిన పరవాడ కృష్ణ... అతడి విజయ ప్రస్థానం ‘ఈతరం’లో ఈ వారం..
విశాఖ నగరానికి చెందిన పరవాడ కృష్ణ 2009లో పోలీసుశాఖలో కానిస్టేబుల్‌గా చేరాడు. చిన్నప్పట్నుంచీ ఈత అంటే ఇష్టం. పాఠశాల స్థాయి నుంచే పోటీల్లో పాల్గొనేవాడు. జాతీయ స్థాయి అంతర విశ్వవిద్యాలయ ఈత పోటీల్లో పాల్గొని ఎనిమిది పతకాలు సాధించాడు. అనంతరం అతడి మనసు ట్రయథ్లాన్‌ వైపు మళ్లింది. ఈత, సైక్లింగ్‌, పరుగు మూడు అంశాలూ కలిసి ఉంటాయందులో. ఆ దిశగా సాధన ప్రారంభించాడు. ఒకటిన్నర కి.మీ.ల దూరం స్విమ్మింగ్‌ తర్వాత 40కి.మీ.ల సైక్లింగ్‌ చేసి, పది కి.మీ.ల పరుగు పోటీలుండే ట్రయథ్లాన్‌లో విజేతగా నిలవడం చాలా కష్టసాధ్యమైన విషయం. శక్తి చాలక చాలామంది పోటీ మధ్యలోనే విరమించుకుంటుంటారు. అయినా అందులోనే విజేతగా నిలవాలనే పట్టుదలతో కృష్ణ ముందుకెళ్లాడు.


సైకిలే దారి చూపింది

కృష్ణని అభినందిస్తున్న విశాఖ c,p,ar, మీనా

కృష్ణ ట్రయథ్లాన్‌లో పట్టు సాధించడానికి అతడి సైకిల్‌ తొక్కే అలవాటే ఆలంబనగా నిలిచింది. విశాఖలోని తన ఇంటి నుంచి పని చేసే భీమిలి పోలీస్‌స్టేషన్‌ 29కి.మీ.ల దూరంలో ఉంటుంది. రోజూ సైకిల్‌పైనే వెళ్లొచ్చేవాడు. రానూపోనూ 58కి.మీ.ల దూరం. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ అలవాటు మానుకోలేదు. ఈ సైక్లింగ్‌ ట్రయథ్లాన్‌కి సాధనగా ఉపయోగపడింది. దాంతోపాటు ఉదయం 8గంటల నుంచి 12గంటల వరకు మొదటి షిఫ్టు విధి నిర్వహణ ముగిసిన వెంటనే వాహనంపై నగరానికి వచ్చి మధ్యాహ్నం 12.30గంటల నుంచి మూడు గంటల వరకు వ్యాయామం చేయడం అతడి అలవాటు. ఇంటికి వెళ్లి భోజనం చేసి మళ్లీ రెండో షిఫ్టు విధి నిర్వహణకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8గంటల వరకు విధులు నిర్వర్తిస్తాడు. అనంతరం భీమిలి నుంచి మళ్లీ సైకిల్‌పై ఇంటికి వచ్చేస్తాడు. డైట్‌ విషయంలోనూ కఠినంగా ఉంటాడు. మధ్యాహ్నం ఒక్కపూటే భోజనం చేస్తాడు. ఆరు ఉడకబెట్టిన గుడ్లు, లీటరు పాలు.. రాత్రి సమయంలో చపాతీలు మాత్రమే అతడి ఆహారం. దేహదారుఢ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో ఎంచుకున్న ఆటలో దూసుకెళ్లడానికి తోడ్పడింది.


విజయాలివే..

* ఆస్ట్రేలియాలోని బాసిల్‌టన్‌లో 2017వ సంవత్సరం డిసెంబరు 2వ తేదీన జరిగిన ట్రయథ్లాన్‌ పోటీల్లో పాల్గొని తొలిసారి ‘ఉక్కు మనిషి’ (ఐరన్‌ మ్యాన్‌) టైటిల్‌ను గెలిచాడు. ఏపీ నుంచి ఈ టైటిల్‌ దక్కించుకున్న మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. పోటీలో భాగంగా కృష్ణ సముద్రంలో 4కి.మీ.ల ఈత, తరువాత 180కి.మీ.ల సైక్లింగ్‌, 42కి.మీ.ల పరుగును 13.40గంటల్లో పూర్తి చేశాడు. విజేతగా నిలవడానికి 16గంటల సమయం ఇవ్వగా 13.40గంటల్లోనే పూర్తిచేసి ‘ఉక్కు మనిషి’గా నిలిచాడు.
* స్పెయిన్‌లోని బార్సిలోనాలో 2018వ సంవత్సరం అక్టోబరు 7న జరిగిన ట్రయథ్లాన్‌ పోటీల్లో రెండోసారి పాల్గొన్నాడు. సముద్రంలో 4కి.మీ.ల ఈత, తరువాత 180కి.మీ.ల సైక్లింగ్‌, 42కి.మీ.ల పరుగును 11.20గంటల్లో పూర్తి చేసి మరింత మెరుగైన ప్రతిభ కనబరచి మరోసారి ‘ఉక్కు మనిషి’   (ఐరన్‌ మ్యాన్‌) టైటిల్‌ను దక్కించుకున్నాడు.
* 2019వ సంవత్సరం ఆగస్టు 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చైనాలోని చాంఘ్డ్‌ నగరంలో జరిగిన ‘ప్రపంచ పోలీసు, అగ్నిమాపక క్రీడోత్సవాల్లో’ ఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖ తరఫున పాల్గొన్నాడు. ట్రయథ్లాన్‌ పోటీలో ఉండే మూడు అంశాలకు ముగ్గురు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉండడంతో కృష్ణ సైక్లింగ్‌ను ఎంచుకున్నాడు. 20కి.మీ.ల సైక్లింగ్‌ను 33నిముషాల్లో పూర్తిచేశాడు. 750మీటర్ల ఈత పోటీని మందార్‌ దివాసే అనే బి.ఎస్‌.ఎఫ్‌. ఇన్‌స్పెక్టర్‌, 5కి.మీ.ల పరుగును విజయవాడకు చెందిన తులసీచైతన్య అనే హెడ్‌ కానిస్టేబుల్‌ విజయవంతంగా పూర్తిచేశారు. మూడు క్రీడాంశాలను కలిపి 1.04గంటల్లో పూర్తిచేసిన కృష్ణ బృందం ఆ పోటీలో బంగారు పతకం సాధించింది. ఈ పోటీలో 63దేశాల పోలీసు క్రీడాకారుల్ని ఓడించి కృష్ణ బృందం ప్రథమ స్థానంలో నిలవడం గమనార్హం.


‘రేస్‌ అక్రాస్‌ అమెరికా’లో సత్తా చూపాలి
- పరవాడ కృష్ణ, కానిస్టేబుల్‌, భీమిలి

నేను ట్రయథ్లాన్‌ పోటీల్లో పాల్గొనడానికి పోలీసు ఉన్నతాధికారులు, దివీస్‌ ఫార్మా సంస్థ ఆర్థికంగా అండగా నిలిచారు. ట్రయథ్లాన్‌ సైకిల్‌ కొనిపించి, విదేశాలకూ పంపించారు. దీంతో నేను ఆందోళన మర్చిపోయి పూర్తిస్థాయిలో ఆటపై దృష్టి పెట్టాను. వచ్చే సంవత్సరం జూన్‌లో అమెరికాలో ‘రేస్‌ ఎక్రాస్‌ అమెరికా’ పేరిట 4,800కి.మీ.ల సైక్లింగ్‌ రేసు జరగనుంది. నిర్ణీత వ్యవధిలో రేసు పూర్తి చేయాలని లక్ష్యం ఇస్తారు. దానికి అర్హత సాధించాలంటే ముందుగా భారతదేశంలో వెయ్యి కి.మీ.ల రేసును మూడు రోజుల్లో పూర్తి చేయాలి. దాని కోసం ప్రస్తుతం సాధన చేస్తున్నా. ‘రేస్‌ ఎక్రాస్‌ అమెరికా’ పోటీల్లో దేశం నుంచి ఇప్పటి వరకు ఇద్దరే విజయం సాధించారు. మూడో వ్యక్తిగా నేను రికార్డు సృష్టించాలన్నదే నా లక్ష్యం.

- బి.ఎస్‌.రామకృష్ణ, ఈనాడు-విశాఖపట్నం


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని