Andhra News: నా చొక్కా, ప్యాంట్‌ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. సాంబశివరావు ఆవేదన

‘నా చొక్కా, ప్యాంట్‌ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. వెంకటేష్‌ పెట్టిన పోస్టును నువ్వే తయారుచేశావా రా? అంటూ ఎస్సై జయకృష్ణ, కానిస్టేబుల్‌ శ్రీనివాసులు మోకాళ్లపై కర్రలతో

Updated : 02 Jul 2022 07:31 IST

ఈనాడు, అమరావతి: ‘నా చొక్కా, ప్యాంట్‌ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. వెంకటేష్‌ పెట్టిన పోస్టును నువ్వే తయారుచేశావా రా? అంటూ ఎస్సై జయకృష్ణ, కానిస్టేబుల్‌ శ్రీనివాసులు మోకాళ్లపై కర్రలతో కొట్టారు. మళ్లీ లేపి గోడకుర్చీ వేయించారు. కాసేపు అటూఇటూ నడిపించారు. నా ల్యాప్‌టాప్‌ తెప్పించారు. పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి మెయిల్‌ ఓపెన్‌ చేయమన్నారు. కంగారులో చేయలేకపోయా. లక్ష్మణ్‌ అనే సీనియర్‌ పోలీసు అధికారి నా గుండెలపై గుద్దారు. నేను బాధతో గట్టిగా అరిచా. నాటకాలేస్తున్నావురా అంటూ దుర్భాషలాడారు..’ అని సీఐడీ పోలీసుల చేతిలో చిత్రహింసకు గురైన సామాజిక మాధ్యమ కార్యకర్త సాంబశివరావు వాపోయారు. జగన్‌ విధానాలు నచ్చక వైకాపా గౌరవాధ్యక్ష పదవికి వై.ఎస్‌.విజయమ్మ రాజీనామా చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చిన లేఖను పోస్టు చేశారన్న అభియోగంపై సీఐడీ పోలీసులు ధరణికోటకు చెందిన వెంకటేష్‌తోపాటు అరెస్టు చేసిన సాంబశివరావు.. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెదేపా అధినేత చంద్రబాబుతోపాటు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. విచారణ పేరుతో సీఐడీ పోలీసులు ఎలా చిత్రహింసలకు గురిచేశారో వివరించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లుకు చెందిన సాంబశివరావు తెదేపా సామాజిక మాధ్యమ విభాగంలో ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నారు.

పెద్దవాళ్లతో పెట్టుకుంటున్నావంటూ బెదిరించారు
‘గురువారం ఉదయం ఏడింటికి పోలీసులు మా ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. తలుపు తీయగానే నువ్వేనా సాంబ? అని అడిగారు. నీ ఫోన్‌ ఇటు ఇవ్వరా.. అంటూ తిట్టారు. నేను కంగారుగా నా భార్య ఉన్న గదిలోకి వెళ్లా. పోలీసులు గదిలోకి వచ్చి నన్ను లాక్కుంటూ బయటకు తెచ్చారు. ఎక్కడికి తీసుకెళుతున్నారని నా భార్య అడిగితే గుంటూరు సీఐడీ ఆఫీసుకంటూ లాక్కుని వెళ్లిపోయారు. అక్కడ పైకి తీసుకెళ్లి దుస్తులు విప్పించి చిత్రహింసలు పెట్టారు. ఎస్సై, కానిస్టేబుల్‌.. చెరో కాలూ పట్టుకుని ఆ మూలకూ, ఈ మూలకూ లాగుతూ ప్రశ్నలు గుప్పించారు. ఒక డీఎస్పీ వచ్చి నిన్ను ఎవరైనా కొట్టారా? అని అడిగారు. కాళ్లపై కొట్టారని చూపించా. వాళ్లంతా బయటకెళ్లి కాసేపటికి మళ్లీ లోనికి వచ్చారు. నిన్ను కొట్టలేదు.. విచారణ చేశామంతే. బయట ఎవరైనా అడిగితే అదే చెప్పు అన్నారు. కొట్టడమంటే ఇది కాదని, నీకు ఒక శాతమే చూపించామని చెప్పారు. నాకు 41(ఎ) నోటీసిచ్చి పంపారు. కొట్టామని బయట చెబితే ఇంకా కేసులు పెడతామని, పెద్దవాళ్లతో పెట్టుకుంటున్నావని బెదిరించారు’ అని సాంబశివరావు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని