‘ఆరోగ్య’మస్తు
‘ఒక ప్రాంతం లేదా దేశం ఎదుర్కొనే విపత్తుల గురించి మనకు తెలుసు. కానీ కొవిడ్ మహమ్మారి కారణంగా 2020లో మనం ఊహించని, మునుపెన్నడూ లేని విపత్కర పరిస్థితులను భరించాం. ఎంతోమంది
ఇంటర్నెట్డెస్క్: ‘‘ఒక ప్రాంతం లేదా దేశం ఎదుర్కొనే విపత్తుల గురించి మనకు తెలుసు. కానీ కొవిడ్ మహమ్మారి కారణంగా 2020లో మనం ఊహించని, మునుపెన్నడూ లేని విపత్కర పరిస్థితులను భరించాం. ఎంతోమంది ఆప్తులను కోల్పోయాం. ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం’’.. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలివి. గతేడాది కాలంగా మహమ్మారిపై పోరు సాగిస్తోన్న భారత్.. తాజా బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం కల్పించింది. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ప్రజారోగ్యం కోసం రూ. 2.23లక్షల కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లోని కేటాయింపులతో పోలిస్తే ఇది 137శాతం ఎక్కువ కావడం విశేషం.
ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి..
కరోనా మహమ్మారి దృష్ట్యా ఈ సారి బడ్జెట్లో వైద్యం, ఆరోగ్యంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. గతంతో పోలిస్తే ఈ రంగానికి రెట్టింపు బడ్జెట్ కేటాయించింది. ఇటీవల తీసుకొచ్చిన ‘ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన’ పథకం ద్వారా రానున్న ఆరేళ్లలో రూ. 64,180కోట్లు ఖర్చు చేయనున్నట్లు విత్తమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ప్రాథమిక, మధ్యస్థ, ప్రాంతీయ ఆరోగ్య వ్యవస్థల బలోపేతం కోసం ఈ మొత్తాన్ని కేటాయించింది. ఈ పథకం ద్వారా.. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్ధారణ ల్యాబ్లు, 11 రాష్ట్రాల్లో 3382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. 602 జిల్లాల్లో క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాకులు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు, 2 మొబైల్ హాస్పిటల్స్, 9 బీఎస్ఎల్-3 స్థాయి ప్రయోగశాలలు, కొత్తగా 4 ప్రాంతీయ వైరాలజీ ల్యాబ్లను ఏర్పాటు చేయనుంది.
వ్యాక్సినేషన్కు రూ. 35వేల కోట్లు
కరోనాపై పోరులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్లో ఇటీవల ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 3కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లకు ఉచితంగా టీకాలు అందిస్తోన్న ప్రభుత్వం.. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది. ఇందుకోసం 2021-22 బడ్జెట్లో రూ. 35వేల కోట్లు కేటాయించింది. అవసరమైతే మరింత కేటాయిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. శాస్త్రవేత్తల కృషితో దేశంలో ప్రస్తుతం రెండు స్వదేశీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో భారతీయులనే గాక, ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లోని ప్రజలకు రక్షణ కల్పిస్తున్నామని ఆర్థికమంత్రి తెలిపారు. త్వరలోనే మరో రెండు టీకాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 2021లోనూ కరోనాపై పోరు సాగించాల్సిన అవసరం ఉందని అన్నారు.
పోషణ పెంచేందుకు..
దేశంలో ఇప్పటికీ ఎంతోమంది సరైన తిండి లేక పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అఆంటి వారి కోసం ప్రత్యేక మిషన్ను ప్రకటించారు. పోషణ్ అభియాన్, సప్లమెంటరీ న్యూట్రిషన్ ప్రొగ్రామ్ను కలిపి మిషన్ పోషణ్ 2.0ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇందుకోసం రూ. 2,700 కోట్లు కేటాయించారు.
‘స్వచ్ఛ భారత్, స్వస్థ్ భారత్’ నినాదంతో ముందుకెళ్తోన్న కేంద్రం పారిశుద్ధ్యం, రక్షిత మంచినీరు, వాయు కాలుష్య నివారణకు కూడా బడ్జెట్లో కేటాయింపులు చేసింది. ఆరోగ్య రంగంలో పరిశోధనలకు రూ. 2,600కోట్లు, ఆయుష్ విభాగానికి రూ. 2,900కోట్లకు పైగా కేటాయించింది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.