నేటి నుంచి అమ‌లు కానున్న 5 ఆదాయ‌పు ప‌న్ను నియ‌మాలు..

కొత్త రూల్ ప్ర‌కారం 75 ఏళ్ల‌కు పైబ‌డిన సీనియర్ సిటిజన్లకు  ఫించను, వ‌డ్డీ చెల్లించే బ్యాంకులు అవ‌స‌ర‌మైన మేర‌కు ప‌న్ను(టీడీఎస్) వ‌సూలు చేస్తాయి. వారు ఐటీఆర్ దాఖ‌లు చేయాల్సినవ‌స‌రం లేదు. 

Published : 01 Apr 2021 10:22 IST

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభ‌మ‌వుతుంది.  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన యూనియ‌న్ బ‌డ్జెట్‌లో ఆదాయ‌పు ప‌న్ను నిబంధ‌న‌ల‌లో కొన్ని మార్పులు ప్ర‌క‌టించారు. ఈ మార్పులు నేటి(ఏప్రిల్1, 2021) నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. 

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఆదాయపు పన్ను మార్పులను ఇప్పుడు పరిశీలిద్దాం:

1.టీడీఎస్..

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను ఫైల్ చేయ‌ని వారికి అధిక టీడీఎస్(మూలం వ‌ద్ద ప‌న్ను మిన‌హాయింపు),  టీసీఎస్(మూలం వ‌ద్ద వ‌సూలు చేసిన ప‌న్ను) వ‌ర్తింప చేయాల‌ని కేంద్ర‌మంత్రి నిర్మాలా సీతారామ‌న్ బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించారు. ఇందుకోసం ఐటీ చ‌ట్టంలో సెక్ష‌న్ 206ఏబీ, సెక్ష‌న్ 206సీసీఏల‌ను చేర్చారు. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం ఈ నిబంధ‌న‌ల‌ను తీసుకువ‌చ్చింది. గత రెండేళ్ల‌లో రూ.50 వేలు, అంత‌కంటే ఎక్కవ టీడీఎస్, టీసీఎస్ ఉన్న‌వారికి నిర్ధిష్ట రేటు కంటే రెట్టింపు లేదా 5 శాతం..ఏది ఎక్కువైతే..ఆ ప‌ద్ధ‌తిలో ప‌న్ను వ‌సూలు చేస్తారు. 

2. సీనియ‌ర్ సిటిజ‌న్లు.. 

75ఏళ్ల‌కు పైబ‌డిన వ్య‌క్తులు ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయ‌న‌వ‌స‌రం లేద‌ని బ‌డ్జెట్ 2021లో ఆర్థిక మంత్రి ప్ర‌క‌టించారు. దీంతో సీనియ‌ర్ సిటిజ‌న్ల‌పై స‌మ్మ‌తి భారం త‌గ్గుతుంద‌ని ఆమె తెలిపారు. ఫించ‌ను, వ‌డ్డీల ద్వారా మాత్ర‌మే ఆదాయం ఉన్న 75 ఏళ్ల‌కు పైబ‌డిన సీనియర్ సిటిజన్లకు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంది. ఇతర మార్గాల ద్వారా ఆదాయం వ‌చ్చే వారికి వ‌ర్తించ‌దు. ఫించను, వ‌డ్డీ చెల్లించే బ్యాంకులు అవ‌స‌ర‌మైన మేర‌కు ప‌న్ను(టీడీఎస్) వ‌సూలు చేస్తాయి.

3. పీఎఫ్‌పై ప‌న్ను నియ‌మాలు..

ఏప్రిల్ 1, 2021 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో  రూ.2.5 లక్షల కంటే(బడ్జెట్‌లో ప్రకటించిన దాని ప్రకారం) ఎక్కువ ఈపీఎఫ్‌లో పెట్టుబడులు పెడితే.. దానిపై వచ్చే వడ్డీకి పన్ను వ‌ర్తిస్తుంది. అయితే, తాజాగా ఈ పన్ను మినహాయింపు పెట్టుబడులను రూ.5 లక్షలకు పెంచారు. కానీ ఈపీఫ్‌కు జ‌మ‌చేసిన మొత్తంలో సంస్థ వాటా ఉండకూడదు. ప్రైవేటు ఉద్యోగులకు వడ్డీపై పన్ను పడకూడదనుకుంటే ఈపీఎఫ్, వీపీఎఫ్ కలిపి గరిష్ఠంగా రూ.2.5 లక్షల వరకే జమ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సంస్థ (ప్రభుత్వం) నుంచి ఎటువంటి వాటా ఉండదు కాబట్టి రూ.5 లక్షల వరకు వీళ్లు జమ చేసుకున్నా.. వడ్డీపై పన్ను పడదు.

4. ముందే నింపిన ఐటిఆర్ ఫారాలు .. 

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ముందుగానే పూర్తిచేసిన ఐటిఆర్ ఫారంల‌ను జారీ చేయనున్నారు.  ఆదాయ‌పు ప‌న్ను దాఖ‌లు ప్రాసెస్‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు గానూ ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో ప‌న్ను చెల్లింపుదారుని శాల‌రీ, ప‌న్ను చెల్లింపులు, టీడీఎస్ త‌దితర వివ‌రాలు ప‌న్ను ఫారంలో ముందే పూర్తిచేసి వ‌స్తాయి. రిట‌ర్నుల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు గానూ  లిస్టెడ్ సెక్యూరిటీల మూలధన రాబ‌డి వివ‌రాలు,  డివిడెండ్ ఆదాయం, బ్యాంకులు, పోస్టాఫీసు డిపాజిట్ల‌పై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయం వంటి వివ‌రాలు కూడా ముందే నింపిన ఫారంలో ఉంటాయి. 

5. ఎల్‌టిసి మిన‌హాయింపు ..

సెలవు ప్రయాణ రాయితీ (ఎల్‌టిసి) బదులుగా నగదు భత్యానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని బడ్జెట్ 2021 లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రయాణానికి కోవిడ్ సంబంధిత పరిమితుల కారణంగా తమ ఎల్‌టీసీ పన్ను ప్రయోజనాన్ని పొందలేకపోయిన వ్యక్తుల కోసం  ప్రభుత్వం ఈ పథకాన్ని గత సంవత్సరం ప్రకటించింది. ఈ ప‌థ‌కం మార్చి31,2021 వ‌ర‌కు  మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. అంటే ఈ తేది లోపు ఖ‌ర్చు చేసిన మొత్తంపై ఇది వ‌ర్తిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని