Vaccine: ‘ఉచిత’ భారం.. రూ. 1.45లక్షల కోట్లు

దేశంలో 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు వేయించే బాధ్యత కేంద్రానిదే అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాలపై పైసా భారం పడదని చెప్పారు.

Updated : 08 Jun 2021 15:57 IST

దిల్లీ: దేశంలో 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు వేయించే బాధ్యత కేంద్రానిదే అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాలపై పైసా భారం పడదని చెప్పారు. అంతేగాక, 80కోట్ల మందికి నవంబరు వరకు ఉచితంగా రేషన్‌ అందించనున్నట్లు తెలిపారు. అయితే ఈ ఉచితాల వల్ల కేంద్రంపై అధిక భారమే పడనుంది. ఉచిత టీకాలు, రేషన్‌ కోసం కేంద్రం దాదాపు రూ. 1.45లక్షల వరకు ఖర్చు చేయనుందని ఆర్థికశాఖ వర్గాలు తాజాగా వెల్లడించాయి.  

18ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వాలంటే రూ. 45వేల కోట్ల నుంచి రూ. 50వేల కోట్ల వరకు ఖర్చవనుంది. కొవిడ్ నిర్వహణ కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన రూ. 35వేల కోట్ల కంటే ఇది చాలా ఎక్కువే. ఇక ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం కింద దాదాపు 80 కోట్ల మందికి దీపావళి వరకు ప్రతి నెలా 5 కిలోల బియ్యం, కేజీ పప్పులను ఉచితంగా అందిస్తామని ప్రధాని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి దాదాపు రూ. 1.1లక్షల కోట్ల నుంచి రూ. 1.3లక్షల కోట్ల వరకు ఖర్చు కానుందని సదరు వర్గాలు వెల్లడించాయి. అంటే మొత్తంగా టీకాలు, రేషన్‌ కలిపి దాదాపు రూ. 1.45లక్షల కోట్ల మేర కేంద్రంపై అదనపు భారం పడనుంది. 

అయితే ఇందుకోసం ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయ రిజర్వ్‌బ్యాంక్‌ నుంచి రూ. 99,122 కోట్ల డివిడెంట్‌ రానుంది. ఇక పెట్రోల్‌, డీజీల్‌పై పన్నుల రూపంలోనే కేంద్రానికి చెప్పుకోదగ్గ ఆదాయమే లభించింది. ఈ నిధుల నుంచి వ్యాక్సిన్లు, రేషన్‌ కోసం ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే టీకాలను ఎక్కడ నుంచి కొనుగోలు చేయనున్న విషయాన్ని మాత్రం సదరు వర్గాలు స్పష్టంగా చెప్పలేదు. 

దేశంలో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌, సీరమ్‌ తయారు చేసిన కొవిషీల్డ్‌, రష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకాల వినయోగానికి అనుమతి ఉంది. అయితే స్పుత్నిక్‌ వి టీకాలు ఇంకా విస్తృతంగా అందుబాటులోకి రాలేదు. మరోవైపు 30 కోట్ల టీకా కోసుల కోసం మరో దేశీయ సంస్థ బయోలాజికల్‌-ఇతో కేంద్రం ఇటీవల ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం రూ. 1500కోట్ల అడ్వాన్స్‌ కూడా చెల్లించనుంది. ఇక విదేశీ టీకాల కోసం కూడా చర్చలు జరుగుతున్నాయి. 

ఈ నెల 21 నుంచి నూతన వ్యాక్సిన్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రధాని మోదీ నిన్న ప్రకటించారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75శాతం తామే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాలు ఇక మీదట వ్యాక్సిన్ల కోసం పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. అంతేగాక, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన ద్వారా దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్‌ను దీపావళి వరకు పెంచుతున్నట్లు మోదీ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని