త్వరగా ఉపసంహరణకు వీలుండే పెట్టుబడి పథకాలు

పెట్టుబడులు పెట్టే ముందు ఉపసంహరణ పరిమితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి....

Published : 21 Dec 2020 16:16 IST

పెట్టుబడులు పెట్టే ముందు ఉపసంహరణ పరిమితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి​​​​​​​

పెట్టుబడుల్లో లిక్విడిటీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పెట్టుబడుల నుంచి ఎవరైనా రాబడి రావాలనే కోరుకుంటారు. అదేవిధంగా ఉపసంహరణకు అనుకూలంగా ఉండే విధంగా పథకాలను ఎంచుకోవాలి . కొన్ని పెట్టుబడులు హదువుకు ముందే ఉపసంహరించుకుంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది లేదా మెచ్యూరిటీ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్ప్పుడు కొన్ని పధకాల ఉపసంహరణ గురించి తెలుసుకుందాం.

ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు:

ఫిక్స్డ్ డిపాజిట్లను ఎంచుకున్నప్ప్పుడు , కాలపరిమితిని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సాధారణంగా ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు ఉంటుంది. రెండు రకాల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి. ఒకటి ముందస్తు ఉపసంహరణకు వీలుండే డిపాజిట్. మరోటి ముందస్తు ఉపసంహరణకు అవకాశం లేని డిపాజిట్. ముందస్తు ఉపసంహరణ ఎఫ్దీ లో కనీసం డిపాజిట్ చేయాల్సిన మొత్తం రూ.1000. ఇందులో ముందుగానే విత్ డ్రా చేస్కునే అవకాశం ఉంటుంది. అయితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు మీ ఎఫ్‌డిపై వడ్డీని పొందలేరు, మరికొన్నింటిలో మీరు మీ పెట్టుబడిపై 0.50-1% జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీకు 7 రోజుల ఎఫ్‌డి ఉంటే, మీరు ముందుగా ఉపసంహరించుకుంటే వడ్డీ లభించదు. ముందస్తు ఉపసంహరణ అవకాశం లేని ఎఫ్‌డిలు ఎక్కువ పెట్టుబడి మొత్తాన్ని కలిగి ఉంటాయి , ఇది కోటి రూపాయల వరకు కూడా ఉండవచ్చు.

ఇక్కడ మీరు మెచ్యూరిటీకి ముందు ఎఫ్‌డిని మూసివేయలేరు. అయితే , చట్టబద్ధమైన, రెగ్యులేటరీ అనుమతించినపుడు, డిపాజిటర్ మరణిస్తే క్లెయిమ్ కోసం…ఇలాంటి అసాధారణమైన పరిస్థితులలో ఈ డిపాజిట్లను ముందస్తుగా ఉపసంహరించుకోవడానికి బ్యాంక్ అనుమతించవచ్చు. అటువంటి అకాల మూసివేత తేదీ వరకు జమ చేసిన లేదా చెల్లించిన వడ్డీ కూడా తిరిగి ఇస్తుంది. మీరు పన్ను ఆదా చేసేందుకు ఎఫ్‌డిలలో పెట్టుబడి పెట్టినట్లయితే, ఐదేళ్లపాటు లాక్-ఇన్ ఉంటుంది, అంటే మరణం వంటి అసాధారణమైన సందర్భాల్లో మాత్రమే ఉపసంహరణ చేయవచ్చు - అప్పుడు జమ చేసిన మొత్తానికి బ్యాంక్ ఎటువంటి వడ్డీని చెల్లించదు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌తో, మీరు ఈ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాలో మీ ఎఫ్‌డి మొత్తాన్ని వేగంగా తిరిగి పొందవచ్చు.

రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ ) విషయంలో, మీరు ప్రతి నెలా ఒక నిర్దిష్ట కాలానికి ఒక నిర్దిష్ట నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెడతారు. మెచ్యూరిటీ తర్వాత, మీ బ్యాంక్ ఖాతాలో అసలు, వడ్డీ మొత్తాన్ని పొందుతారు. ముందస్తు ఉపసంహరణ విషయంలో, ఎఫ్‌డిల మాదిరిగానే, బ్యాంకు డిపాజిట్ ఉన్న కాలానికి వడ్డీని లెక్కిస్తుంది. సాధారణంగా, రికరింగ్ డిపాజిట్ రేటులో 0.50%-1% మధ్య జరిమానా వసూలు చేస్తుంది.

చిన్న పొదుపులు, మ్యూచువల్ ఫండ్స్:

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్), కిసాన్ వికాస్ పత్రా లేదా సుకన్య సమృద్ధి ఖాతా వంటి చిన్న పొదుపు సాధనాలలో మీరు పెట్టుబడి పెడుతున్నారా? ఈ సాధనాలన్నీ వేర్వేరు ఉపసంహరణ ప్రక్రియలను కలిగి ఉంటాయి. పిపిఎఫ్ విషయంలో, మీరు ఐదేళ్ళు పూర్తయిన తర్వాత మాత్రమే ముందస్తుగా ఖాతాను మూసివేయవచ్చు, అది కూడా అత్యవసర వైద్య చికిత్స లేదా ఉన్నత విద్య వంటి సందర్భాల్లోనే సాధ్యమవుతుంది . పిపిఎఫ్‌లో పాక్షిక ఉపసంహరణకు ఏడవ సంవత్సరం తర్వాత మాత్రమే అనుమతి ఉంటుంది . ముందస్తు ఉపసంహరణపై జరిమానా పడుతుంది. అంతేకాకుండా 1% తక్కువ వడ్డీ లభిస్తుంది. సుకన్య సమృద్ది ఖాతాలో , ఖాతాదారు 18 ఏళ్ళు నిండినప్పుడు, అమ్మాయి విద్య లేదా వివాహం కోసం డబ్బు అవసరమైతే పాక్షిక ఉపసంహరణ (మొత్తం మొత్తంలో 50%) అనుమతి లభిస్తుంది .

మ్యూచువల్ ఫండ్లలో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. సాధారణ లిక్విడ్ ఫండ్లలో మీరు T + 1 లో డబ్బును పొందవచ్చు. అంటే మీరు ఉపసంహరణ కోరిన రోజు + ఒక పని దినం. కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు (లిక్విడ్ ఫండ్లలో) ఎటిఎం నుంచి విత్డ్రా చేసుకున్నట్లుగా వెంటనే డబ్బును ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తాయి.
కొన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల సెటిల్మెంట్ వ్యవధి T + 3 గా ఉంటుంది. అంటే మీ ఖాతాలో డబ్బు పొందడానికి మూడు పని రోజులు పడుతుంది. మీకు అంతర్జాతీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే, దీని కోసం 5-10 పనిదినాలు వేచి చూడాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లలో, ముందస్తు ఉపసంహరణకు జరిమానా లేనప్పటికీ పన్ను, స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాలను పరిశీలించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని