అంచనాల కంటే రూ.4 లక్షల కోట్ల అదనపు ఆదాయం

దేశంలో పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2022-23) బడ్జెట్‌ అంచనాల కంటే రూ.4 లక్షల కోట్లు పెరగొచ్చని రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ బుధవారం వెల్లడించారు.

Published : 24 Nov 2022 02:37 IST

2022-23పై రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌  

దిల్లీ: దేశంలో పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2022-23) బడ్జెట్‌ అంచనాల కంటే రూ.4 లక్షల కోట్లు పెరగొచ్చని రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ బుధవారం వెల్లడించారు. ఆదాయపు పన్నుతో పాటు దిగుమతి సుంకం, జీఎస్‌టీ వసూళ్లు పెరగడమే ఇందుకు కారణమన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.27.50 లక్షల కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. అయితే వ్యక్తిగత, కార్పొరేట్‌ ఆదాయపు పన్ను వసూళ్లు రూ.17.50 లక్షల కోట్లు, దిగుమతి, ఎగుమతి సుంకాలు, వస్తు-సేవల పన్నులు కలిపి మరో రూ.14 లక్షల కోట్లు ఖజానాకు చేరతాయని తరుణ్‌ బజాజ్‌ వివరించారు. అంటే బడ్జెట్‌ అంచనాల కంటే రూ.4 లక్షల కోట్లు అదనంగా రాబోతున్నాయని తెలిపారు.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.20 లక్షల కోట్లు, పరోక్ష పన్ను వసూళ్లు రూ.13.30 లక్షల కోట్లు కలిపి మొత్తంగా రూ.27.50 లక్షల కోట్ల లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలోనూ ప్రత్యక్ష పన్ను వసూళ్లు లక్ష్యం కంటే సుమారు 50 శాతం పెరిగి రూ.14.10 లక్షల కోట్లకు చేరాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి కంటే అధిక పన్ను వసూళ్ల ధోరణి కొనసాగుతోందని బజాజ్‌ వెల్లడించారు. దిగుమతి, ఎగుమతి సుంకాలను ఇటీవల తగ్గించినప్పటికీ, బడ్జెట్‌లో విధించుకున్న రూ.2.13 లక్షల కోట్లు, రూ.3.35 లక్షల కోట్ల లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని