TCS: మహిళా ఉద్యోగుల వలసలు అధికమయ్యాయ్‌.. ఆ కారణం వల్లే: టీసీఎస్‌

తమ సంస్థలో మగవాళ్ల కంటే మహిళా ఉద్యోగుల వలసల శాతమే ఎక్కువగా ఉందని దిగ్గజ సాంకేతిక సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మంగళవారం వెల్లడించింది.

Updated : 08 Jun 2023 07:03 IST

ముంబయి: తమ సంస్థలో మగవాళ్ల కంటే మహిళా ఉద్యోగుల వలసల శాతమే ఎక్కువగా ఉందని దిగ్గజ సాంకేతిక సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మంగళవారం వెల్లడించింది. ఉద్యోగులకు ఇంటి వద్ద నుంచి పని చేసే సదుపాయాన్ని నిలిపేయడం ఇందుకు ప్రధాన కారణమై ఉండొచ్చని పేర్కొంది. టీసీఎస్‌లో మొత్తం 6 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా.. వీరిలో మహిళల సంఖ్య  35 శాతంగా ఉంది. సాధారణంగా మహిళా ఉద్యోగుల వలసల రేటు మగవాళ్లతో పోలిస్తే సమానంగా లేదా వారి కంటే తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మగవాళ్లకు మించి ఉద్యోగినుల వలసల రేటు నమోదవుతోందని టీసీఎస్‌ మానవ వనరుల అధికారి మిలింద్‌ లక్కడ్‌ వార్షిక నివేదికలో తెలిపారు. అయితే మహిళలు, పురుషుల వారీగా వలసల శాతాన్ని ఈ నివేదికలో కంపెనీ తెలియజేయలేదు.  సిబ్బంది మొత్తం వలసల రేటు గత ఆర్థిక సంవత్సరం మధ్యలో గరిష్ఠ స్థాయికి చేరినా, మార్చి చివరికి 20 శాతానికి దిగివచ్చింది. ‘ఐఎక్సెల్‌’ లాంటి నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించడం ద్వారా, నాయకత్వ స్థానాల్లోకి మరింతమంది మహిళలు వస్తారని లక్కడ్‌ తెలిపారు.  ఇప్పటివరకు 22 దఫాలుగా నిర్వహించిన ఈ శిక్షణ ద్వారా 1,450 మంది మహిళా ఉద్యోగులు ప్రయోజనం పొందారు. 2022-23లో నాయకత్వ స్థానాల్లో నాలుగింట ఒక వంతు మంది (సుమారు 25%) మహిళలు అంతర్గతంగా నియమితులయ్యారని లక్కడ్‌ తెలిపారు. దరఖాస్తుల ద్వారా నియమితులైన వాళ్లలో మహిళల సంఖ్య 14 శాతమేనని పేర్కొన్నారు. 2022-23లో టీసీఎస్‌ నికర నియామకాల్లో మహిళలు 38.1 శాతం వరకు ఉంటారని తెలిపారు.

* అనుభవం ఉన్న మహిళా వృత్తి నిపుణులు, విరామం తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరేందుకు చేపట్టిన ‘రీబిగిన్‌’ కార్యక్రమానికి 2022-23లో సుమారు 14,000 ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయి.

* ఉన్నత యాజమాన్య విభాగంలో సుమారు 30,000 మంది ఉద్యోగులుండగా.. వీళ్లలో మహిళలు 4,000 లేదా 13 శాతంగా ఉంటారని నివేదిక తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని