Union Budget 2022: ఉద్యోగాలు సృష్టించే బడ్జెట్‌ అవ్వాలి

రాబోయే బడ్జెట్‌లో ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం అమిత ప్రాధాన్యం ఇవ్వాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ఆకాంక్షించారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పరుగులు పెట్టించే నిర్ణయాలు తీసుకోవడంతో పాటు..

Updated : 28 Jan 2022 04:44 IST

దువ్వూరి సుబ్బారావు

దిల్లీ: రాబోయే బడ్జెట్‌లో ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం అమిత ప్రాధాన్యం ఇవ్వాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ఆకాంక్షించారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పరుగులు పెట్టించే నిర్ణయాలు తీసుకోవడంతో పాటు.. అసమానతల తొలగింపునకూ చర్యలుండాలని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పనకు కేటాయింపులను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈసారి బడ్జెట్లో పన్ను రేట్ల కోతలు ఎక్కువగా ఉండవనే తాను భావిస్తున్నానని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న పార్లమెంటులో 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సుబ్బారావు తన అభిప్రాయాలు తెలిపారు.

సంతృప్తికర వృద్ధి అవసరం

వృద్ధి నెమ్మదించడం వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. పలు రంగాలు కార్మిక ఆధారిత అసంఘటిత రంగం నుంచి మూలధన ఆధారిత సంఘటిత రంగానికి మారడమూ మరో కారణం. ఉద్యోగాల సృష్టికి అవసరమైన స్థాయిలో వృద్ధి లేదు.

ఆదాయ అసమానతలు తగ్గేలా

అసంఘటిత రంగంలో ఎక్కువగా పనిచేసే అల్పాదాయ వర్గాల ఆదాయాలపై కొవిడ్‌-19 పరిణామాలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. అధిక ఆదాయ వర్గాలు తమ ఆదాయాలను పరిరక్షించుకోవడమే కాకుండా.. సంపద, పొదుపును పెంచుకున్నాయి. అత్యంత అసమానతలున్న దేశాల్లో భారత్‌ ఒకటని ప్రపంచ అసమానతల నివేదిక గుర్తించినందున, సరిదిద్దే చర్యలు అవసరం.

పన్ను రేటు కోతలుండవేమో

ఈసారి పన్ను వసూళ్లు బాగా పెరిగాయి. అయితే ప్రైవేటీకరణ ప్రక్రియ కింద నిధుల సమీకరణ పరిమితంగానే ఉండటం, ఆహారం, ఎరువుల రాయితీలకు అధిక కేటాయింపుల వల్ల ద్రవ్యలోటుపై నికర ప్రభావం స్వల్పంగానే ఉంది. అందువల్ల పన్ను రేట్ల కోతలు ఎక్కువగా ఉండబోవనే అనుకుంటున్నా.

ద్రవ్యలోటు లక్ష్యాన్ని నెరవేరిస్తేనే

2025-26 కల్లా ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించుకోవాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ విషయంలో ఏ మాత్రం పక్కకు జరిగినా. విశ్వసనీయత, వృద్ధి అవకాశాలు, మదుపరి సెంటిమెంటుపై ప్రభావం పడుతుంది.

ద్రవ్యోల్బణంపై..

గత రెండేళ్లుగా ఆర్‌బీఐ లక్షిత శ్రేణిలోని ఎగువ స్థాయికి ద్రవ్యోల్బణం చేరుకుంది. బేస్‌ ఎఫెక్ట్‌ (తక్కువ ప్రాతిపదిక), కమొడిటీ ధరలు పెరగడం, ఉత్పత్తుల ధరల పెంపు లాంటి వాటితో ద్రవ్యోల్బణంపై మరింత ఒత్తిడి పెరగనుంది. పేదలను సంక్షోభంలోని బయటకు తేవాలంటే ద్రవ్యోల్బణ నియంత్రణ ఎంతో అవసరం. ద్రవ్యోల్బణాన్ని లక్షిత శ్రేణిలోని మధ్య స్థాయికి తీసుకుని రావాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని