11 నుంచి డెలివరీ ఐపీఓ

రూ.5,235 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) రాబోతున్నట్లు డెలివరీ గురువారం వెల్లడించింది. ఈ నెల 11న మొదలై 13న ఇష్యూ ముగియనున్నట్లు తెలిపింది. దీనికి రూ.462-487ను ధరల శ్రేణిగా నిర్ణయించింది. కనీసం 30 షేర్లకు (ఒక లాట్‌) మదుపర్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని,

Published : 06 May 2022 03:46 IST

ధరల శ్రేణి రూ.462-487

దిల్లీ: రూ.5,235 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) రాబోతున్నట్లు డెలివరీ గురువారం వెల్లడించింది. ఈ నెల 11న మొదలై 13న ఇష్యూ ముగియనున్నట్లు తెలిపింది. దీనికి రూ.462-487ను ధరల శ్రేణిగా నిర్ణయించింది. కనీసం 30 షేర్లకు (ఒక లాట్‌) మదుపర్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, యాంకర్‌ మదుపర్లకు ఈ నెల 10న బిడ్డింగ్‌ నిర్వహిస్తామని పేర్కొంది. రూ.7,460 కోట్ల నిధుల సమీకరణ చేపట్టాలని తొలుత భావించినా ఆ మొత్తాన్ని ప్రస్తుతం రూ.5,235 కోట్లకు కుదించుకున్నట్లు వెల్లడించింది. రూ.4,000 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయడంతో పాటు రూ.1,235 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదార్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయించనున్నారని వివరించింది. కార్లైల్‌ గ్రూప్‌, సాఫ్ట్‌ బ్యాంక్‌తో పాటు డెలివరీ సహ వ్యవస్థాపకులు కపిల్‌ భారతి, మోహిత్‌ టాండన్‌, సూరజ్‌లు కూడా షేర్లను విక్రయించనున్నారని తెలిపింది. ప్రస్తుతం సాఫ్ట్‌ బ్యాంక్‌కు 22.78 శాతం, కార్లైల్‌కు 7.42 శాతం, భారతికి 1.11 శాతం, టాండన్‌కు 1.88 శాతం, సూరజ్‌కు 1.79 శాతం వాటాలున్నాయి.
* ప్రుడెంట్‌ కార్పొరేట్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ ధరల శ్రేణి రూ.595-630: రిటైల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ప్రుడెంట్‌ కార్పొరేట్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ ఐపీఓకు రూ.595-630ను ధరల శ్రేణిగా నిర్ణయించింది. ఇష్యూ ఈ నెల 10న మొదలై 12న ముగియనుంది. కనీసం 23 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. యాంకర్‌ మదుపర్లకు ఒక రోజు ముందే బిడ్డింగ్‌ ప్రక్రియ మొదలవనుంది. 85,49,340 షేర్లను తాజాగా జారీ చేయడంతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో షేర్లను విక్రయించనున్నారు. ప్రస్తుత వాటాదారు వాగ్నెర్‌ 82,81,340 ఈక్విటీ షేర్లను, పూర్తి కాల డైరెక్టర్‌, సీఈఓ శిరీష్‌ పటేల్‌ 2,68,000 షేర్లను విక్రయించనున్నారు. ప్రస్తుతం వాగ్నెర్‌కు 39.91 శాతం వాటా, శిరీష్‌కు 3.15 శాతం వాటా కంపెనీలో ఉంది. ఈ ఐపీఓ ద్వారా రూ.538.61 కోట్ల నిధుల్ని సమీకరించబోతోంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, ఈక్విరస్‌ క్యాపిటల్‌ ఈ ఇష్యూకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
* వీనస్‌ పైప్స్‌ అండ్‌ ట్యూబ్స్‌ ఐపీఓ కూడా ఈ నెల 11 నుంచి ప్రారంభం కాబోతోంది. 13న ముగియనుంది. 50.74 లక్షల ఈక్విటీ షేర్లను సంస్థ విక్రయించనుంది. ధరల శ్రేణి, ఇతర వివరాలు వెల్లడించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని