అప్పు చేసి మదుపు చేయొద్దు
నా వయసు 24 ఏళ్లు. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. రూ.75లక్షల టర్మ్ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. దీంతోపాటు నెలకు రూ.10వేల చొప్పున మదుపు చేయాలనేది ఆలోచన.
నా వయసు 24 ఏళ్లు. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. రూ.75లక్షల టర్మ్ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. దీంతోపాటు నెలకు రూ.10వేల చొప్పున మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 15 ఏళ్లపాటు నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి?
- నరేశ్
* మీపై ఆధారపడిన వారికి ఆర్థిక రక్షణ కల్పించేందుకు టర్మ్ పాలసీ తీసుకోవడం మంచి ఆలోచనే. మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ పాలసీ మొత్తం ఉండేలా చూసుకోండి. ఈ మొత్తాన్ని విభజించి మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు కంపెనీల నుంచి తీసుకునేందుకు ప్రయత్నించండి. దీంతోపాటు వ్యక్తిగత ప్రమాద బీమా, డిజేబిలిటీ బీమా పాలసీలు ఎంచుకోండి. ఆరోగ్య బీమా పాలసీ లేకపోతే.. తప్పనిసరిగా తీసుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.10వేలను డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) ద్వారా మదుపు చేయండి. కాస్త నష్టభయం ఉన్నా.. దీర్ఘకాలంలో మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు 15 ఏళ్లపాటు నెలకు రూ.10వేలు మదుపు చేస్తూ వెళ్తే.. 12 శాతం రాబడి అంచనాతో దాదాపు రూ.44,73,565 మీ చేతికి వచ్చే వీలుంది. మీ ఆదాయం పెరిగినప్పుడు పెట్టుబడినీ పెంచుకుంటూ వెళ్లండి.
వ్యక్తిగత రుణం తీసుకొని షేర్లలో మదుపు చేయాలని అనుకుంటున్నాను. రుణానికి 13 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలి. స్టాక్ మార్కెట్లో దీనికన్నా అధిక మొత్తం వస్తుంది అని అంటున్నారు. నిజమేనా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- మహిపాల్
* గత ఏడాదిన్నరగా స్టాక్ మార్కెట్ల పనితీరు చాలా మెరుగ్గా ఉంది. ఈ సమయంలో మదుపు చేసిన వారికి మంచి లాభాలే కనిపించాయి. స్టాక్ మార్కెట్లో లాభాలే కాదు.. నష్టాలూ ఉంటాయని గమనించాలి. పెట్టుబడులకు ఎప్పుడూ సొంత డబ్బులే వినియోగించాలి. అంతేకానీ, రుణం తీసుకొని పెట్టుబడులు పెట్టడం సరికాదు. మీరు వ్యక్తిగత రుణం తీసుకున్నప్పుడు వడ్డీతోపాటు ప్రాసెసింగ్ ఫీజుల్లాంటివీ చెల్లించాలి. మొత్తానికి వడ్డీ రేటు 13 శాతానికి మించే ఉంటుంది ఈ డబ్బులు స్టాక్ మార్కెట్లో మదుపు చేస్తే.. ఇంతకంటే అధిక రాబడి రావచ్చు.. లేదా పెట్టుబడి మొత్తం నష్టపోయే ఆస్కారమూ ఉంది. కాబట్టి, అప్పు తీసుకొని మదుపు చేసేకన్నా.. మీరు రుణానికి చెల్లించే ఈఎంఐ ఎంతో చూసుకొని, ఆ మొత్తాన్నే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లకు నెలనెలా కేటాయించండి. అయిదేళ్లకు మించి పెట్టుబడి కొనసాగించాలని అనుకున్నప్పుడే స్టాక్ మార్కెట్లో మదుపు చేయండి.
మా పాప వయసు 6 ఏళ్లు. తన పేరుమీద పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో మదుపు చేద్దామని అనుకుంటున్నాం. దీనికోసం నెలకు రూ.8 వేల వరకూ కేటాయించగలం. ప్రత్యామ్నాయ పెట్టుబడులు ఎంచుకోవాలా?
- శ్వేత
* ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన.. ఈ రెండు పథకాలూ పూర్తి సురక్షితం. ఈ రెండూ పన్ను మినహాయింపు కోసమూ ఉపయోగపడతాయి. వచ్చిన రాబడిపైనా పన్ను వర్తించదు. మీరు కేటాయించాలనుకుంటున్న రూ.8వేలలో రూ.5వేలను సుకన్య సమృద్ధి పథకంలో మదుపు చేయండి. మిగతా రూ.3వేలను హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్లలో సిప్ చేయండి. సుకన్య సమృద్ధిలో ప్రస్తుతం 7.6శాతం వడ్డీ అందుతోంది. ఈ రెండు పథకాల్లో మీరు రూ.8వేలను 15 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తే.. సగటున 10 శాతం రాబడితో రూ.30,50,158 జమ అయ్యే అవకాశం ఉంది.
నేను రెండు నెలల్లో పదవీ విరమణ చేయబోతున్నాను. ఆ తర్వాత నెలనెలా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చేలా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లకు బదులుగా లిక్విడ్ ఫండ్లలో మదుపు చేయొచ్చా?
- కృష్ణ
* ప్రస్తుతం బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లపై వచ్చే రాబడీ తగ్గింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపైనే లిక్విడ్ ఫండ్లకన్నా అధిక రాబడి వస్తోంది. మీకు పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలను పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ స్కీం లేదా ప్రధానమంత్రి వయ వందన యోజన పథకాల్లో జమ చేయొచ్చు. వీటిల్లో గరిష్ఠంగా రూ.15లక్షల వరకూ పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. పోస్టాఫీసు మంత్లీ ఇన్కం స్కీంనూ పరిశీలించండి.
- తుమ్మ బాల్రాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా