GST: పన్ను శ్లాబుల్లో మార్పులు ఉంటాయా? జీఎస్‌టీ రేట్ల హేతుబద్ధీకరణపై 17న సమావేశం

వస్తు, సేవల పన్ను (GST) శ్లాబుల్లో మార్పులు జరగనున్నాయా? ఇకపై ఎన్ని శ్లాబులు ఉండనున్నాయి? మూడు శ్లాబులా? లేదంటే యథావిధిగా ఐదా? వీటిన్నింటిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Published : 15 Jun 2022 22:26 IST

దిల్లీ: వస్తు, సేవల పన్ను (GST) శ్లాబుల్లో మార్పులపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ సహా మరికొన్ని కీలక మార్పులపై మంత్రుల బృందం జూన్‌ 17న సమావేశం కానుంది. ఈ భేటీలో పన్ను శ్లాబుల్లో మార్పులు తీసుకొచ్చే అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. పన్ను శ్లాబుల్లో మార్పులపై తుది నివేదికను రూపొందించనున్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్‌టీ కౌన్సిల్‌ ఈ నెలాఖరులో సమావేశం కానుంది. ఈ భేటీలో మంత్రులు సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు. అయితే, రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించే అవకాశం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

2017 జులై 1న జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది జులై నాటికి ఐదేళ్లు పూర్తవుతుంది. జీఎస్టీ అమలు వల్ల ఇప్పటివరకు (జూన్‌ 2022 వరకు) ఆదాయాన్ని నష్టపోయిన రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తామని కేంద్రం తెలిపింది. దీనికి 2015-16 నాటి రాష్ట్రాల ఆదాయాన్ని ఆధారంతో ఏటా 14 శాతం వృద్ధిని పరిగణనలోకి తీసుకొని నష్టాన్ని లెక్కిస్తామని తెలిపింది. అయితే గత ఐదేళ్లలో పరిశ్రమ, వ్యాపార వర్గాల డిమాండ్‌తో పలు వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. దీంతో ఆదాయం తగ్గి రాష్ట్రాలకు లోటు ఏర్పడింది. తొలుత 28 శాతం పరిధిలో ఉన్న వస్తువుల సంఖ్య 228గా ఉండగా.. ఇప్పుడది 35కు తగ్గింది. ఈ నేపథ్యంలో రేట్లను హేతుబద్ధీకరించాలన్న డిమాండ్‌ పెరిగింది. దీంతో దీనిపై అధ్యయనం చేసి నివేదికను సమర్పించాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గతేడాది 2021 నవంబరులో తొలిసారి సమావేశం అయ్యింది. తాజాగా ఈ బృందం జూన్‌ 17న సమావేశమై పన్ను శ్లాబుల మార్పులపై చర్చించనుంది. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబులు ఉన్నాయి. అత్యవసర వస్తువులన్నీ అతి తక్కువ పన్ను శ్లాబైన ఐదు శాతం పరిధిలో ఉన్నాయి. విలాస వస్తువులకు 28 శాతం జీఎస్టీ వర్తిస్తోంది. వీటిలో 5 శాతం శ్లాబును 8 శాతానికి పెంచాలని మంత్రుల బృందం చూస్తున్నట్లు తెలుస్తోంది. 12 శాతం పన్ను రేటును పూర్తిగా తొలగించి.. ఆ పరిధిలో ఉన్న వస్తువులను 18 శాతం శ్లాబులోకి తీసుకురావాలని ప్రతిపాదించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని