ఆరోగ్య బీమా ప్రీమియం 15-35 శాతం భారం!

దేశ వ్యాప్తంగా రోజుకు 2.70 లక్షల కొవిడ్‌-19 కేసులు నమోదవుతున్నాయి. ఇతర వ్యాధులు, అనారోగ్యాలతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్యకన్నా ఈ మహమ్మారి బాధితులే ఇప్పుడు అధికంగా ఉంటున్నారు. చికిత్స ఖర్చూ రూ.లక్షల్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీలను అందించే సాధారణ బీమా, ఆరోగ్య బీమా సంస్థలపై క్లెయింల ఒత్తిడి పెరిగిపోయింది....

Updated : 20 Apr 2021 15:39 IST

కొవిడ్‌ క్లెయింలు పెరగడంతో సంస్థల ముందుజాగ్రత్త

ఈనాడు, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా రోజుకు 2.70 లక్షల కొవిడ్‌-19 కేసులు నమోదవుతున్నాయి. ఇతర వ్యాధులు, అనారోగ్యాలతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్యకన్నా ఈ మహమ్మారి బాధితులే ఇప్పుడు అధికంగా ఉంటున్నారు. చికిత్స ఖర్చూ రూ.లక్షల్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీలను అందించే సాధారణ బీమా, ఆరోగ్య బీమా సంస్థలపై క్లెయింల ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ప్రీమియం పెంచడంపై సంస్థలు దృష్టి సారించాయి. ఇప్పటికే కొన్ని బీమా సంస్థలు ఈ దిశగా అడుగులు వేశాయి. ఇంకొన్ని త్వరలోనే పెంచేందుకు నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకుని, ఎదురు చూస్తున్నాయి.
కొన్నాళ్ల క్రితం.. రూ.5లక్షల ఆరోగ్య బీమా పాలసీ ఉంటే.. కుటుంబానికి కొంత భరోసా ఉండేది. కరోనా కాలంలో ఇది చాలా చిన్న మొత్తం అయిపోయింది. ఈ నేపథ్యంలో చాలామంది అధిక విలువ పాలసీలను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇదే సమయంలో బీమా సంస్థలూ తమ ప్రీమియం రేట్లను సవరించేందుకు ప్రయత్నిస్తున్నాయి.  గత ఏడాది చివరలో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) బీమా పాలసీలకు ప్రామాణిక నిబంధనలు అమలు చేయడంతో పాటు, ఆధునిక చికిత్సలైన రోబోటిక్‌ సర్జరీలాంటి వాటికీ క్లెయిం ఇవ్వాల్సిందేనని మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా చికిత్సకు వైద్య బీమా పాలసీ వర్తిస్తుందని, ఇందులో సందేహాలకు తావు లేదని స్పష్టం చేసింది. బీమా సంస్థలు తమ పాలసీలకు అందుకు తగినట్లుగా మార్పులు చేయాల్సిందిగా సూచించింది. ఈ కొత్త మార్పులూ బీమా ప్రీమియం పెరుగుదలకు కారణం అవుతోంది.

వైద్య ద్రవ్యోల్బణం 20శాతం పైనే..
2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2020-21లో వైద్య ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. నివేదికల ప్రకారం ఇది దాదాపు 20శాతానికి పైగానే ఉంది. కరోనా చికిత్సకు భారీగా ఖర్చు కావడం ఒకటైతే.. మరోవైపు సాధారణ చికిత్సల వ్యయాన్నీ ఆసుపత్రులు గణనీయంగా పెంచడం ఇందుకు నేపథ్యం. రానున్న రోజల్లో ఇది మరింత పెరుగుతుందని బీమా సంస్థల భావన. ఈ నేపథ్యంలోనే బీమా సంస్థలు తమ పాలసీల ప్రీమియాన్ని 15 శాతం నుంచి గరిష్ఠంగా 35శాతానికి పైగా పెంచాయి. ఏప్రిల్‌ 1 నుంచి చాలా బీమా సంస్థలు పాలసీలు పునరుద్ధరణ చేసుకుంటున్న వారి నుంచి పెంచిన ప్రీమియాన్నే వసూలు చేస్తున్నాయి.

రూ.13వేల కోట్లకు పైగా..
అందుబాటులో ఉన్న సమాచారం మేరకు.. గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా క్లెయింలు దాదాపు రూ.13వేల కోట్ల వరకు ఉన్నాయి. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలకు క్లెయింల పరిష్కారం కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. చాలా బీమా సంస్థలు పాలసీల పునరుద్ధరణ సమయంలో పెంచిన ప్రీమియాన్ని వసూలు చేస్తున్నాయి. కొత్తగా పాలసీ తీసుకున్న వారికి అధిక ప్రయోజనాలు కల్పిస్తున్నామని చెబుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్న వారికి పాలసీల్లో ప్రీమియం పెరిగే మార్పులు చేయొద్దని నియంత్రణ సంస్థ చెప్పినప్పటికీ.. సంస్థలు మాత్రం కొన్ని మార్పులు చేసి, ఆ పాలసీలకు ప్రీమియం పెంచడం ప్రారంభించాయి.

46 ఏళ్ల వారికి..
సాధారణంగానే బీమా సంస్థలు 45 నుంచి 46లోకి ప్రవేశించిన వారికి ఆరోగ్య బీమా ప్రీమియాన్ని దాదాపు 35-40 శాతం అధికంగా వసూలు చేస్తాయి. బీమా సంస్థలను బట్టి, ఇందులో కాస్త హెచ్చుతగ్గులు ఉండవచ్చు. దీంతోపాటు 60 నుంచి 61 ఏళ్లలోకి వస్తున్న వారికీ ఈ ప్రీమియం పెంపు భారం ఉంటుంది. ఈ ప్రీమియం పెంపుతో పాటు, బీమా సంస్థలు పెంచుతున్న ప్రీమియంతో కలిస్తే.. దాదాపు 50-60 శాతంపైనే భారం పడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని