iPhone 15 Series: భారత్‌లో ప్రారంభమైన ఐఫోన్ 15 అమ్మకాలు.. లాంచ్‌ ఆఫర్లివే

యాపిల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌ అమ్మకాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. కొత్త ఐఫోన్ సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు కొనుగోలుదారులు దిల్లీ, ముంబయిలోని యాపిల్ స్టోర్ల ముందు ఉదయం నుంచి క్యూ కట్టారు. 

Updated : 22 Sep 2023 12:28 IST

దిల్లీ/ముంబయి: యాపిల్‌ (Apple) కొత్త ఫోన్‌ ఐఫోన్‌ 15 (iPhone 15 Series) సిరీస్‌ అమ్మకాలు నేటి నుంచి భారత్‌లో ప్రారంభమయ్యాయి. కొత్త ఐఫోన్‌లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఉదయం నుంచే యాపిల్ స్టోర్ల వద్దకు చేరుకున్నారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని రిలయన్స్ జియో వరల్డ్‌ డ్రైవ్‌లోని యాపిల్ బీకేసీ (Apple BKC) స్టోర్‌తోపాటు దిల్లీలోని సెలెక్ట్‌ సిటీవాక్‌ మాల్‌లో ఉన్న యాపిల్‌ సాకేత్‌  (Apple Saket) స్టోర్‌ ముందు ఐఫోన్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

భారత్‌లో ఐఫోన్ 15 సిరీస్‌ ధర, ఆఫర్లివే

యాపిల్ కంపెనీ ఐఫోన్‌ 15 సిరీస్‌ను సెప్టెంబరు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఐఫోన్‌ 15 (iPhone 15), ఐఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus), ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ (iPhone 15 Pro Max). భారత్‌ మార్కెట్లో ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.79,900గా కంపెనీ నిర్ణయించింది. ఇక ఐఫోన్ 15 ప్లస్‌ రూ.89,900 కాగా, ఐఫోన్ 15 ప్రో ధర రూ.1,34,900, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ను రూ.1,59,900కి విక్రయించనుంది.  

లాంఛ్‌ ఆఫర్‌ కింద హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుతో ఐఫోన్ 15 సిరీస్‌ను కొనుగోలు చేసేవారు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. ఐఫోన్ 15  ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ కొనుగోలు చేసేవారికి రూ.6,000 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్‌పై రూ.5,000 డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతోపాటు పాత ఐఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా ట్రేడ్‌-ఇన్‌ బెనిఫిట్‌ కింద డిస్కౌంట్‌ పొందవచ్చు. ఇవే కాకుండా ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్లు ఐఫోన్ 15 అమ్మకాలపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. 

‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ఐఫోన్‌.. గర్వంగా ఉందన్న మాధవన్‌ 

తాజాగా సినీనటుడు మాధవన్‌ (Madhavan) ఐఫోన్‌ 15 కొన్నట్లు ఎక్స్‌ (Twitter)లో ట్వీట్‌ చేశారు. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా ఐఫోన్‌ 15 ను సొంతం చేసుకున్నందుకు ఎంతో గర్వంగా, థ్రిల్‌గా ఉంది (#MakeIndia #iPhone15)’ అంటూ కొత్తగా కొన్న ఐఫోన్15 ఫొటోతో పాటు జాతీయ జెండా ఎమోజీలను జోడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ‘ఐఫోన్‌ వాడుతున్న మ్యాడీ’ ‘ మీరు, మీ కొత్త ఫోన్‌ చాలా అందంగా ఉన్నాయి’ అంటూ రాసుకొచ్చారు.

మరోవైపు కొత్త ఐఫోన్ సిరీస్‌ అమ్మకాలతో భారత్‌ మొబైల్‌ మార్కెట్‌లో అధిక వాటాను సొంతం చేసుకోవాలని యాపిల్ భావిస్తోంది. ఈ ఏడాది ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ అత్యధికంగా అమ్ముడవుతాయని యాపిల్‌ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌లో బ్లూ టైటానియం, బ్లాక్‌ టైటానియం కలర్‌ వేరియంట్లు అక్టోబర్‌ మూడోవారంలో కొనుగోలుదారుల చేతికి రానున్నట్లు సమాచారం. మరోవైపు నేచురల్‌ టైటానియం, వైట్‌ టైటానియం వేరియంట్ల కోసం నవంబర్‌ రెండోవారం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని