LIC IPO Listing: నిరాశపర్చిన ఎల్‌ఐసీ లిస్టింగ్‌

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎల్‌ఐసీ ఐపీఓ (LIC IPO Listing) షేర్లు నేడు మార్కెట్లలో లిస్టయ్యాయి. గత కొన్ని రోజులుగా గ్రేమార్కెట్‌ ట్రేడింగ్‌ సూచించినట్లుగానే షేర్లు రాయితీతో ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి....

Updated : 17 May 2022 10:31 IST

ముంబయి: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎల్‌ఐసీ ఐపీఓ (LIC IPO Listing) షేర్లు నేడు మార్కెట్లలో లిస్టయ్యాయి. గత కొన్ని రోజులుగా గ్రేమార్కెట్‌ ట్రేడింగ్‌ సూచించినట్లుగానే షేర్లు నష్టంతో ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. దీంతో భారీ ఆశలతో దరఖాస్తు చేసుకున్న మదుపర్లకు నిరాశ తప్పలేదు. ముఖ్యంగా లిస్టింగ్‌ గెయిన్స్‌ కోసం బిడ్లు దాఖలు చేసిన చిరుమదుపర్లు చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది. ఎన్ఎస్‌ఈలో ఈ షేరు ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే 8.11 శాతం నష్టంతో రూ.872 వద్ద లిస్టయ్యింది. ఈ లెక్కన కనీసం ఒకలాట్‌ (15 షేర్లు)కు రూ.14,235 పెట్టుబడిగా పెట్టిన మదుపర్లకు రూ.1,155 లిస్టింగ్‌ లాస్‌ తప్పలేదు.  

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఎల్‌ఐసీ గరిష్ఠ ధర వద్ద రూ.20,557 కోట్లు సమీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో ఎల్‌ఐసీ షేర్లు లిస్టింగ్‌కు రావడం ప్రతికూలాంశంగా మారింది. ఎల్‌ఐసీ ఐపీఓకి దాదాపు మూడు రెట్ల స్పందన లభించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒక్కో షేరుపై రూ.60 రాయితీ పొందిన పాలసీదారులు వారికి కేటాయించిన విభాగంలో 6 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలు చేశారు. ఉద్యోగుల విభాగంలో 1.94 రెట్లు, రిటైల్‌ విభాగంలో 1.94 రెట్లు, క్యూఐబీ 2.83 రెట్లు, ఎన్‌ఐఐలు 2.8 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలు చేశారు. రిటైల్‌, ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.45 రాయితీ ఇచ్చిన విషయం తెలిసిందే.

పబ్లిక్‌ ఇష్యూ (Public issue) ధరల శ్రేణి రూ.902-949గా ప్రకటించారు. అయితే పాలసీదార్లకు రూ.60; రిటైల్‌ మదుపర్లు, ఉద్యోగులకు రూ.45 చొప్పున రాయితీ దక్కింది. 30 కోట్ల వరకు పాలసీదార్లు; 13 లక్షల మంది ఏజెంట్లు ఉన్న ఎల్‌ఐసీకి మొత్తం బీమా ప్రీమియంలో (2020-21) 64 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. 2019-20లో రూ.5.7 లక్షల కోట్ల ప్రీమియం ఆదాయంతో భారత బీమా మార్కెట్‌ రికార్డు సృష్టించింది. ఇందులో ఎల్‌ఐసీ (LIC)కి రూ.3.8 లక్షల కోట్ల ఆదాయం దక్కింది.

దీర్ఘకాలం లాభదాయకం.. నిపుణులు

మరోవైపు ఆర్థిక నిపుణులు, మార్కెట్‌ విశ్లేషకులు మాత్రం ఎల్‌ఐసీ దీర్ఘకాలంలో మంచి లాభాలిస్తుందని సూచిస్తున్నారు. మదుపర్లు ఏమాత్రం తొందరపడొద్దని.. దీర్ఘకాల వ్యూహంతో ముందుకెళ్లాలని సలహా ఇస్తున్నారు. బీమా రంగంలో ఉన్న ఇతర ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ఎల్‌ఐసీ భవిష్యత్తులో చాలా మెరుగైన ఫలితాలను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు దాని పీ/ఈవీ విలువతో పోలిస్తే 4 రెట్లు అధిక ధర వద్ద ట్రేడవుతున్నాయని వివరించారు. అలాగే ఎస్‌బీఐ షేర్లు పీ/ఈవీ విలువ కంటే 2.9 రెట్లు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు పీ/ఈవీ విలువ కంటే 2.2 రెట్లు అధిక ధర వద్ద ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ షేర్లు సైతం భవిష్యత్తులో మంచి లాభాలిస్తాయని అంచనా వేస్తున్నారు.

(గమనిక: స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పూర్తిగా నష్టభయంతో కూడుకున్న అంశం. ఇందులో పెట్టుబడి పెట్టడం పూర్తిగా వ్యక్తిగత అంశం. పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని