Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మరోసారి భారీ తొలగింపులు

Microsoft: ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ మరో సారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోంది.

Updated : 11 Jul 2023 17:38 IST

వాషింగ్టన్‌: పెద్ద పెద్ద టెక్‌ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు (Lay offs) ప్రక్రియలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ (Microsoft) మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది జనవరిలో 10 వేల మందికి పైగా ఉద్యోగులను తీసేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వాటికి అదనంగా మరిన్ని కోతలకు సిద్ధమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి వారం నుంచే ఈ తొలగింపు ప్రక్రియ ప్రారంభించింది.

తాజా తొలగింపుల్లో భాగంగా వాషింగ్టన్‌ కార్యాలయంలోని ఉద్యోగుల్లో 276 మందిని తగ్గించుకుంది. అందులో 66 మంది వర్చువల్‌గా పనిచేస్తున్నవారు ఉన్నారు. వీరిలో సేల్స్‌, కస్టమర్‌ సక్సెస్‌ రిప్రజెంటేటివ్స్‌ తాము ఉద్యోగాలు కోల్పోయినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. తమ క్లౌడ్ కంప్యూటింగ్ బిల్లులో ఖర్చులను తగ్గించుకునేందుకు లేఆఫ్‌లు తీసుకొచ్చిన్నట్లు మైక్రోసాఫ్ట్‌ ఇటీవల వెల్లడించింది. రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని ప్రకటించిన ఆ సంస్థ.. సంఖ్యను వెల్లడించటానికి నిరాకరించింది.

‘‘సంస్థాగత, శ్రామిక సర్దుబాట్లు మా వ్యాపార నిర్వహణలో సాధారణం. మా సంస్థ భవిష్యత్‌ కోసం కస్టమర్లకు మద్దతుగా వ్యూహాత్మక వృద్ధి రంగాలకు ప్రాధాన్యమిస్తూ పెట్టుబడి కొనసాగిస్తాం’’ అని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే అమెజాన్‌ (Amazon), గూగుల్‌ (Google), ట్విటర్‌ (Twitter)తో పాటు ప్రముఖ టెక్‌ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గించుకున్న విషయం తెలిసిందే. కొవిడ్‌ సమయంలో ఎదురైన పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరతలు, మాంద్యం భయాలతో కంపెనీలన్నీ వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని