Petrol Prices: రాష్ట్రాలకు పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించే వెసులుబాటు ఉంది: ఎస్‌బీఐ

పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించేందుకు అవకాశం ఉందని విశ్లేషించింది....

Updated : 30 May 2022 13:36 IST

దిల్లీ: ప్రజలపై ధరల భారాన్ని తగ్గించడంలో భాగంగా ఇటీవల కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. అదే బాటలో కొన్ని రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా తగ్గించాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. తాజాగా విడుదలైన ఎస్‌బీఐ నివేదిక సైతం అదే విషయాన్ని నొక్కి చెప్పింది. వ్యాట్‌ను తగ్గించేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు ఉందని విశ్లేషించింది.

ఇటీవల చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో వ్యాట్‌ రూపంలో రాష్ట్రాలు రూ.49,229 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకున్నాయని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. కేంద్రం ఎక్సైజ్‌ సుంకం తగ్గించడం వల్ల రూ.15,021 ఆదాయాన్ని కోల్పోయాయని పేర్కొంది. అయినా, రాష్ట్రాలకు ఇంకా రూ.34,208 కోట్ల అదనపు ఆదాయం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో వ్యాట్‌ను తగ్గించే వెసులుబాటు రాష్ట్రాలకు ఉందని స్పష్టం చేసింది. చమురు ధరలపైనే వ్యాట్‌ ఆదాయం ఆధారపడి ఉంటుంది. ధరలు పెరిగితే ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ చమురు ధరలు తగ్గితే ఆదాయం కూడా తగ్గుతుంది. ఇటీవల కేంద్రం ఎక్సైజ్‌ సుంకం తగ్గించిన నేపథ్యంలో ధరలు తగ్గి వ్యాట్‌ ఆదాయంలో కూడా కోత పడింది.

ఇటీవలి ధరల పెరుగుదల వల్ల వ్యాట్‌ ఆదాయం రూపంలో మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ అత్యధికంగా లబ్ధిపొందాయని నివేదిక పేర్కొంది. కొవిడ్‌ సంక్షోభం తర్వాత రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి క్రమంగా గాడినపడుతోందని నివేదికలో ఎస్‌బీఐ చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ సౌమ్యకాంతి ఘోష్‌ అన్నారు. దీంతో రాష్ట్రాలు రుణ సమీకరణకు కూడా తగ్గించుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పన్నులను తగ్గించడానికి రాష్ట్రాలకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. లీటర్‌ డీజిల్‌పై రూ.2, పెట్రోల్‌పై రూ.3 తగ్గించేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు ఉందని తెలిపారు.

జీడీపీలో అప్పుల వాటా తక్కువగా ఉన్న మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలు పెట్రోల్‌పై రూ.5 వరకు తగ్గించేందుకు వీలుందని ఘోష్‌ నివేదికలో తెలిపారు. హరియాణా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల జీడీపీలో పన్నుల వాటా 7 శాతంగా ఉందని పేర్కొన్నారు. కాబట్టి ఆయా రాష్ట్రాలు సైతం ఇంధనంపై ఉన్న పన్నులను తగ్గించొచ్చని సూచించారు. ఏదేమైనప్పటికీ.. పెట్రో ఉత్పత్తులపై పన్ను విషయంలో ఉన్న సంక్లిష్టతలను తొలగించాలంటే వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ఒక్కటే మార్గమని నివేదిక సూచించింది. అయితే, అలా చేయడం వల్ల కేంద్రం రూ.20,000 కోట్ల ఆదాయం కోల్పోతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో సరైన పద్ధతిని రూపొందించి పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని