Twitter: నవంబరు 29న బ్లూటిక్‌ సేవల పునరుద్ధరణ

నకిలీ ఖాతాలను అరికట్టేందుకు బ్లూటిక్‌ సేవల్ని నిలిపివేసిన ట్విటర్‌ వాటిని తిరిగి నవంబరు 29 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. 

Published : 16 Nov 2022 11:06 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ (Twitter)లో నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా నిలిపివేసిన బ్లూటిక్‌ (Blue Tick) సబ్‌స్క్రిప్షన్‌ సేవల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తెలిపారు. నవంబరు 29న దీన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అప్పటికల్లా ఎటువంటి లోపాలు లేకుండా తీర్చిదిద్దేందుకు కృష్టి చేస్తున్నామన్నారు. నెలకు 8 డాలర్లు చెల్లిస్తే.. కొన్ని అదనపు ప్రయోజనాలను అందించేలా బ్లూటిక్‌ (Blue Tick) సేవల్ని ట్విటర్‌ నవంబరు 6న ప్రారంభించిన విషయం తెలిసిందే. కానీ, వేరే వ్యక్తులు, సంస్థల పేరిట కొంతమంది నకిలీ ఖాతాలను సృష్టించి.. వాటికి బ్లూటిక్‌ పొందడంతో గందరగోళం తలెత్తింది. ఏవి నిజమైన ఖాతాలో.. ఏవి కావో తెలుసుకునేందుకు యూజర్లు తికమకపడ్డారు. దీంతో ట్విటర్‌ (Twitter) తాత్కాలికంగా ఈ సేవల్ని నిలిపివేసింది.

భారత్‌లో ట్విటర్‌ చాలా స్లో..

భారత్‌లో ట్విటర్‌ (Twitter) చాలా నెమ్మదిగా పనిచేస్తోందని స్వయంగా ఎలాన్ మస్క్‌ ప్రకటించారు. ఇండోనేసియా సహా మరికొన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. హోంలైన్‌ ట్వీట్లు రీఫ్రెష్‌ కావడానికి 10- 15 సెకన్లు పడుతోందని తెలిపారు. కొన్నిసార్లు పూర్తిగా పనిచేయడం లేదన్నారు. ముఖ్యంగా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ సమస్య తలెత్తుతోందన్నారు. 

అయితే, బ్యాండ్‌విడ్త్‌, లేటెన్సీ, యాప్‌ ఈ మూడు కారణాలతో ఎంతెంత జాప్యం జరుగుతుందో తెలియాల్సి ఉందన్నారు మస్క్‌. సంస్థలోని ఇంజినీర్లు చెప్పినట్లు కంటే రీఫ్రెష్‌ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటోందన్నారు. అమెరికాలో 2 సెకన్లు పడితే.. భారత్‌లో మాత్రం 20 సెకన్ల వరకు సమయం తీసుకుంటోందన్నారు. ట్విటర్‌ కొన్ని దేశాల్లో చాలా నెమ్మదిగా పనిచేస్తోందని.. అందుకు తనని క్షమించాలని ఇటీవలే మస్క్‌ వినియోగదారులను కోరిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే విషయాన్ని ఆయన బహిరంగంగా అంగీకరించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని