DRDO scientist: పాక్‌ మహిళకు ఆకర్షితులై.. క్షిపణి రహస్యాలు చెప్పిన డీఆర్‌డీవో శాస్త్రవేత్త

పాక్‌ వలపువలలో చిక్కుకున్న ఓ డీఆర్‌డీవో శాస్త్రవేత్త (DRDO scientist) దేశ రక్షణకు సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని చేరవేశాడు. మహిళ మాటలకు ఆకర్షితుడై క్షిపణి వివరాలను పంచుకున్నాడు.

Published : 08 Jul 2023 12:31 IST

పుణె: భారత రక్షణ రంగానికి (Defence Sector) చెందిన అత్యంత రహస్యమైన క్షిపణి (Indian missile systems) సమాచారాన్ని పాకిస్థాన్‌ (Pakistan)కు చేరవేస్తున్నాడనే ఆరోపణలపై డీఆర్‌డీవో శాస్త్రవేత్త (DRDO scientist) ప్రదీప్‌ కురుల్కర్‌ (Pradeep Kurulkar) ఇటీవల అరెస్టయ్యారు. ఈ కేసులో తాజాగా మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్‌ (ATS) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్‌ నిఘా ఏజెంట్‌ వలపు వలలో పడిన ఆయన.. ఆమెకు అత్యంత రహస్య విషయాలు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఛార్జ్‌షీట్‌లో ఉన్న వివరాల ప్రకారం..

ప్రదీప్‌ కురుల్కర్‌.. మహారాష్ట్ర (Maharashtra)లోని పుణెలో గల రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ల్యాబ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు గతేడాది ‘జారా దాస్‌గుప్తా’ పేరుతో ఓ మహిళ పరిచయమైంది. తానో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అని యూకేలో పనిచేస్తున్నానని చెప్పింది. ఆ తర్వాత ఆయనకు అశ్లీల వీడియోలు, మెసేజ్‌లు పంపి ప్రదీప్‌తో స్నేహం పెంచుకుంది. వీరిద్దరూ వాట్సాప్‌లో వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ఆకర్షితుడైన ప్రదీప్‌.. భారత క్షిపణి వ్యవస్థకు చెందిన అత్యంత రహస్య సమాచారం, రక్షణ రంగ ప్రాజెక్టుల గురించి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

డ్రోన్లు, క్షిపణులు, బ్రహ్మోస్‌, అగ్ని మిసైల్‌ లాంఛర్లు, యూసీవీ, మిలిటరీ బ్రిగేడింగ్‌ సిస్టమ్‌ వంటి పలు రక్షణ రంగ ప్రాజెక్టుల గురించి వీరిద్దరూ చాటింగ్‌ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి తన వ్యక్తిగత ఫోన్లో ఉన్న సమాచారాన్ని ప్రదీప్‌ ఆమెకు పంపినట్లు తెలిసింది. 2022 జూన్‌ నుంచి డిసెంబరు మధ్య వీరిద్దరూ చాటింగ్‌ చేసుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఆయన కార్యకలాపాలపై అనుమానం రావడంతో డీఆర్‌డీఓ (DRDO) అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ఈ విషయం తెలియగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రదీప్‌.. జారా నంబరును బ్లాక్‌ చేసినట్లు తెలిసింది.

అధికారిక షెడ్యూళ్లు, లొకేషన్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని తెలిసినా ప్రదీప్‌.. ఆ విషయాలను జారాతో చెప్పినట్లు ఏటీఎస్‌ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. ఐపీ అడ్రసు ద్వారా ఆమె నంబరును ట్రేస్‌ చేయగా.. పాకిస్థాన్‌ నుంచి చాట్‌ చేసినట్లు తెలిసింది. ఆమె పాక్‌ నిఘా సంస్థ (Pakistani Intelligence Operative)కు చెందిన ఏజెంట్‌గా గుర్తించిన అధికారులు.. ఈ ఏడాది మే 3వ తేదీన ప్రదీప్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని