జన్మదిన వేడుకల్లో విషాదాంతం

స్నేహితుడి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న విద్యార్థి అనుకోని విధంగా ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు.

Updated : 27 Nov 2022 04:03 IST

జారిపడిన ఘటనలో విద్యార్థి మృతి

నవదీప్‌

రేణిగుంట, న్యూస్‌టుడే: స్నేహితుడి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న విద్యార్థి అనుకోని విధంగా ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. పట్టణ పోలీసుల కథనం మేరకు.. కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన హరినారాయణ కుమారుడు నవదీప్‌ (18) రేణిగుంటలోని ఓ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్నారు. గురువారం అర్ధరాత్రి స్నేహితుడు కళ్యాణ్‌ జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడ కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. ఈ సమయంలో నవదీప్‌ జారి పడటంతో తలకు బలమైన గాయమైంది. చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి తిరుపతి మార్గంలోని నారాయణాద్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే విద్యార్థి తండ్రి హరినారాయణకు కళాశాల సిబ్బంది సమాచారం అందించారు. శుక్రవారం వేకువజామున ఇక్కడికి చేరుకున్న హరినారాయణ మెరుగైన చికిత్స నిమిత్తం నవదీప్‌ను చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఎస్‌ఐ ఈశ్వరయ్య విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై శుక్రవారం కళాశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం విద్యార్థి తండ్రి హరినారాయణ ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.

పలు అనుమానాలు...

ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన సమయం అర్ధరాత్రి కావడంతో కళాశాల సిబ్బంది ఏం చేస్తున్నారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదట విద్యార్థుల మధ్య ఘర్షణ అని, తర్వాత జారి పడ్డాడని చెబుతున్నారు. అసలు విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని