Drugs Case: క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్‌

బాలీవుడ్‌ని కుదిపేస్తున్న ముంబయి క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో అరెస్టయినవారిలో ఇద్దరు నిందితులకు బెయిల్‌ మంజూరైంది........

Published : 26 Oct 2021 19:32 IST

ముంబయి: బాలీవుడ్‌ని కుదిపేస్తున్న ముంబయి క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో అరెస్టయినవారిలో ఇద్దరు నిందితులకు బెయిల్‌ మంజూరైంది. ముంబయిలోని మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల (ఎన్‌డీపీఎస్‌) కేసుల విచారణకు ఉద్దేశించిన ప్రత్యేక న్యాయస్థానం మనీశ్‌ రాజ్‌గారియా, అవిన్‌ సాహూలకు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ కూడా ఇదే కేసులో నిందితుడిగా అరెస్టు కావడంతో ఈ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 2న తాము దాడి చేసిన క్రూజ్‌ నౌకలో వీరిద్దరూ అతిథులుగా ఉన్నట్టు నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) కోర్టుకు తెలిపింది. ఈ కేసులో తొలిసారి బెయిల్‌ పొందిన నిందితులు వీరిద్దరే కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ కేసులో ఆర్యన్‌తో పాటు 20 మందిని ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల ఆర్యన్‌కు ఈ న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించడంతో ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు సుదీర్ఘ వాదనలు విన్న బాంబే హైకోర్టు.. బుధవారం కూడా వాదనలు విననున్నట్టు తెలిపింది. రేపు మధ్యాహ్నం 2.30గంటలకు ఆర్యన్‌ సహా అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ ధమేచా బెయిల్‌ పిటిషన్లపై వాదనలు కొనసాగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని