Delhi: నడిరోడ్డుపై మహిళను వెంబడించి.. పిల్లల ముందే దారుణ హత్య

దిల్లీలో ఘోరం జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళను వెంబడించిన వ్యక్తి.. పిల్లలు చూస్తుండగానే ఆ తల్లిని దారుణంగా హత్యచేశాడు......

Published : 23 Apr 2022 01:46 IST

దిల్లీ: దిల్లీలో ఘోరం జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళను వెంబడించిన వ్యక్తి.. పిల్లలు చూస్తుండగానే ఆ తల్లిని దారుణంగా హత్యచేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ఘటన దిల్లీలో ఈరోజు మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసు అధికారి వివరాల ప్రకారం.. ‘మహిళపై దాడి జరిగిందంటూ మధ్యాహ్నం 2గంటల సమయంలో సాగర్‌పుర్‌ పోలీసుస్టేషన్‌కు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం. బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు’ అని తెలిపారు.

పలు సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అయితే నిందితుడు వెంబడిస్తుండగా.. ఇద్దరు పిల్లలతో ఉన్న సదరు మహిళ పరిగెడుతూ కనిపించింది. 2.10గంటలకు రోడ్డుపైనే పిల్లలు చూస్తుండగానే.. వెంటతెచ్చుకున్న కత్తితో సదరు మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు మృతురాలు, నిందితుడు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితమే ఆమె కుటుంబంతో సహా వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. కాగా ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని