logo

Crime: కొడుకు లాగే ఉన్నాడని కిడ్నాప్‌

చనిపోయిన తన చిన్నకొడుకు లాగే ఉన్నాడని బాలుడిని కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవారి దర్శనార్థం ఛత్తీస్‌గఢ్‌ నుంచి తిరుపతి బాలాజీ లింకు బస్టాండుకు వచ్చిన యాత్రికుల బృందంలోని చిన్నారి శివమ్‌ సాహూ (6) కిడ్నాప్‌ ఉదంతం అప్పట్లో సంచలనం రేపింది.

Updated : 07 Jul 2021 09:53 IST

నాలుగు నెలల తర్వాత నిందితుడి అరెస్టు


నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న తిరుపతి తూర్పు డీఎస్పీ మురళీకృష్ణ, అలిపిరి పోలీసులు

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: చనిపోయిన తన చిన్నకొడుకు లాగే ఉన్నాడని బాలుడిని కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవారి దర్శనార్థం ఛత్తీస్‌గఢ్‌ నుంచి తిరుపతి బాలాజీ లింకు బస్టాండుకు వచ్చిన యాత్రికుల బృందంలోని చిన్నారి శివమ్‌ సాహూ (6) కిడ్నాప్‌ ఉదంతం అప్పట్లో సంచలనం రేపింది. అప్పుడే బాలుడిని కనుగొని తల్లిదండ్రులకు అప్పగించినా.. పరారీలో ఉన్న నిందితుడిని నాలుగు నెలల తర్వాత అరెస్టు చేశారు. తిరుపతి తూర్పు డీఎస్పీ మురళీకృష్ణ మంగళవారం అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుడిని ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ‘ తిరుపతిలో బాలుడి కిడ్నాప్‌ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఛేదించాం. తిరుపతి హరేరామ హరేకృష్ణ ఆలయం వద్ద పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అదుపులోకి తీసుకొని విచారించాం. కర్ణాటక రాష్ట్రం ముళబాగల్‌ తాలూక పుట్టణహళ్లి గ్రామానికి చెందిన వెంకట రమణప్ప శివప్రసాద్‌ అలియాస్‌ శివారెడ్డిగా గుర్తించాం. విచారణలో.. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీ శ్రీవారి దర్శనార్థం తిరుపతి వచ్చిన ఉత్తమ్‌ కుమార్‌ సాహూ కుమారుడు శివమ్‌ సాహూని కిడ్నాప్‌ చేసినట్లు అంగీకరించాడు. లారీ డ్రైవరు అయిన శివారెడ్డి హిందీ భాష సరళంగా మాట్లాడటం వల్ల కొన్ని నిమిషాల్లోనే బాలుడు ఆకర్షితుడై వెంట వెళ్లాడు. బాలుడిని తీసుకుని విజయవాడకు వెళ్లగా.. తాను కిడ్నాప్‌ చేసిన విషయం మీడియా ద్వారా తెలుసుకుని దుర్గమ్మ గుడి సమీపంలో బాలుడిని వదిలేసి వెళ్లిపోయాడు. అక్కడ నుంచి తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించాం. ఆ సమయంలో 15 టీమ్‌లు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇన్ని రోజులకు మళ్లీ తిరుపతికి వచ్చిన శివారెడ్డిని అలిపిరి ఎస్‌ఐ దేవేంద్రకుమార్‌, ఎస్‌ఐ జయచంద్ర, సిబ్బంది ప్రసాద్‌, రాజశేఖర్‌, నాగార్జున, లక్ష్మణరావు చాకచక్యంగా అరెస్టు చేశారు..’ అని డీఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని