logo

తితిదే బడ్జెట్‌లో శ్రీనివాససేతుకు రూ.25 కోట్లు

శ్రీవారికి హుండీ ఆదాయంతోపాటు ఇప్పటికే వివిధ బ్యాంకుల్లో పెట్టిన పెట్టుబడులే ఆదాయ వనరుగా మారాయి. రానున్న ఆర్థిక సంవత్సరం(2023-24)లో ఈ రెండింటి ద్వారా సుమారు రూ.2,581 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

Published : 22 Mar 2023 04:34 IST

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, తిరుమల: శ్రీవారికి హుండీ ఆదాయంతోపాటు ఇప్పటికే వివిధ బ్యాంకుల్లో పెట్టిన పెట్టుబడులే ఆదాయ వనరుగా మారాయి. రానున్న ఆర్థిక సంవత్సరం(2023-24)లో ఈ రెండింటి ద్వారా సుమారు రూ.2,581 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తం ఆదాయంలో 58.50 శాతం వీటి ద్వారానే వస్తుందని బడ్జెట్‌లో పొందుపర్చారు. తితిదే 2023-24 వార్షిక ఆదాయం రూ.4,411.68 కోట్లు ఉంటుందని ఇటీవల ధర్మకర్తల మండలిలో ప్రవేశపెట్టారు. ఇందులో వచ్చే ఆర్థిక సంవత్సరంలో శ్రీనివాససేతు కోసం రూ.25 కోట్లు పొందుపర్చారు. గత ఏడాది రూ.200 కోట్లు పొందుపర్చడంతో ఇప్పుడు కేటాయించిన నిధుల ద్వారా పనులు పూర్తి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రసాదాలు, ఆర్జిత సేవల ద్వారా వచ్చే ఆదాయంలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఈ ఏడాది తరహాలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం(2023-24)లో ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.500 కోట్లు, దర్శన టికెట్ల ద్వారా రూ.330 కోట్లు, ఆర్జిత సేవల ద్వారా రూ.140 కోట్లు, కల్యాణకట్ట ద్వారా రూ.126.50 కోట్లు వస్తాయని భావిస్తున్నారు.

ధర్మప్రచారానికి..

హిందూ ధర్మ ప్రచారానికి రూ.93 కోట్లు బడ్జెట్‌లో పెట్టారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ద్వారా వీటిని ఖర్చు చేయనున్నారు. వివిధ సంస్థలకు గ్రాంటు కింద రూ.115.50 కోట్లు ఖర్చు చేస్తారు. తితిదే విద్యా సంస్థల్లో వివిధ అవసరాలకు రూ.128.88 కోట్లు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. అలాగే వివిధ విశ్వవిద్యాలయాలకు గ్రాంట్ల కింద రూ.29 కోట్లు పొందుపర్చారు. ఆరోగ్యంతోపాటు పారిశుద్ధ్య విభాగానికి రూ.103.19 కోట్లు, ఎఫ్‌ఎంఎస్‌ సేవలకు రూ.60 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు రూ.58.10 కోట్లు, స్విమ్స్‌కు గ్రాంటు కింద రూ.86 కోట్లు, బర్డ్‌, ఎస్వీ ప్రాణదాన ట్రస్టులకు రూ.60 కోట్లు కేటాయించారు. వీటితోపాటు విజిలెన్స్‌ విభాగానికి రూ.178.33 కోట్లు పొందుపర్చారు.


ఇంజినీరింగ్‌ విభాగానికి....

రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇంజినీరింగ్‌ విభాగానికి సుమారు రూ.300 కోట్లు బడ్జెట్‌లో పొందుపర్చారు. ఇందులో ఆసుపత్రుల్లో పనులకు రూ.106.65 కోట్లు ఖర్చు చేయనున్నారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు రూ.42.13 కోట్లు, రహదారులకు రూ.29.49 కోట్లు, కల్యాణమండపాల నిర్మాణం, మరమ్మతులకు రూ.18.02 కోట్లు వెచ్చించనున్నారు. ఆలయ పనులకు రూ.14.06 కోట్లు పొందుపర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని