logo

ప్రతిభ పోటీలతో ఉన్నతస్థాయిలో రాణింపు

పాఠశాల దశ నుంచే పోటీ పరీక్షల్లో పాల్గొనటం ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించేందుకు దోహదపడుతుందని తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహం అన్నారు.

Published : 21 Mar 2023 05:37 IST

శ్రీసత్యసాయి గురుకులం పాఠశాలలో నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

శ్యామలాసెంటర్‌, ధవళేశ్వరం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: పాఠశాల దశ నుంచే పోటీ పరీక్షల్లో పాల్గొనటం ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించేందుకు దోహదపడుతుందని తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహం అన్నారు. రాజమహేంద్రవరంలోని శ్రీసత్యసాయి గురుకులం పాఠశాలలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాస్థాయి ప్రతిభా పాటవ పోటీలు సోమవారం జరిగాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, తుని, మండపేట, కొవ్వూరు ప్రాంతాల్లో విజేతలుగా నిలిచిన 8, 9, 10 తరగతులకు చెందిన 72 మంది విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరికి వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్‌, చిట్టి కథలు అంశాల్లో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఈఓ ఎస్‌.అబ్రహం మాట్లాడుతూ తాను చదువుకున్న రోజుల్లో వ్యాసరచన, క్విజ్‌ వంటి పోటీల్లో పాల్గొనటం వల్లే ఈ స్థాయికి చేరానన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు అనేక అవకాశాలున్నాయని, ముఖ్యంగా ఆన్‌లైన్‌ వేదికగా జరిగే పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో పిల్లలకు ఇటువంటి పోటీలు నిర్వహించటం అభినందనీయమన్నారు. సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ‘ఈనాడు’ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను శ్రీ సత్యసాయి గురుకులం పాఠశాల కరస్పాండెంట్‌ ఎ.శ్యాంసుందర్‌ కొనియాడారు. ప్రిన్సిపల్‌ కె.గుర్రయ్య మాట్లాడుతూ విద్యార్థికి కేవలం చదువు ఒక్కటే ముఖ్యం కాదని, ఇటువంటి పోటీల్లోనూ ప్రతిభ చాటాలని సూచించారు. కార్యక్రమంలో ‘ఈనాడు’ రాజమహేంద్రవరం యూనిట్‌ ఇన్‌ఛార్జి టి.వి.చంద్రశేఖర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ‘ఈనాడు’ తరఫున అందించిన బహుమతులు, ప్రశంసా పత్రాలను ముఖ్య  అతిథులు డీఈఓ ఎస్‌.అబ్రహం, శ్రీ సత్యసాయి గురుకులం పాఠశాల కరస్పాండెంట్‌ ఎ.శ్యాంసుందర్‌, ప్రిన్సిపల్‌ కె.గుర్రయ్య చేతులుమీదుగా విజేతలకు అందజేశారు. ఈమని సత్యనారాయణ, డాక్టర్‌ వి.రమాదేవి, కడలి.ఎస్‌.ఆర్‌.రాజేశ్వరి, తులసీరావు, మోటూరి శ్రీనివాసరావు, పి.పి.ఎస్‌.జె.శాస్త్రి పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.


ఉమ్మడి జిల్లాస్థాయి విజేతలు వీరే

క్విజ్‌: ఆర్‌.జయంత్‌(భాష్యం ఆంగ్ల మాధ్యమ పాఠశాల, కాకినాడ), కె.తేజశ్రీ(ప్రగతి ఆంగ్ల మాధ్యమ పాఠశాల, రాజమహేంద్రవరం), ఎం.యశ్వంత్‌(సర్‌.సి.వి.రామన్‌
పాఠశాల, అమలాపురం).

చిట్టి కథలు: కె.భువన(శశి ఆంగ్ల మాధ్యమ పాఠశాల, మండపేట), ఎం.సాయి శరణ్య (భాష్యం ఆంగ్ల మాధ్యమం పాఠశాల, రాజమహేంద్రవరం), ఎ.అఖిల(విద్యానిధి పాఠశాల, అమలాపురం).

వ్యాసరచన: బి.ఎల్‌.వినమ్రత(లయోల పాఠశాల, తుని), మంచిగంటి శాలిని(హోలి ఏంజిల్స్‌ పాఠశాల, కొవ్వూరు), ఎం.సమన్విత (ప్రగతి పాఠశాల, రాజమహేంద్రవరం).

చిత్రలేఖనం: ఆర్‌.పాప(జిల్లా పరిషత్‌ పాఠశాల, తుని), పి.వైష్ణవి(సురేష్‌ పాఠశాల, కాకినాడ), కె.సత్య చంద్రిక (నారాయణ పాఠశాల, తుని)లు మొదటి మూడుస్థానాల్లో నిలిచారు.


21 వేల మంది విద్యార్థుల భాగస్వామ్యం

కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు

విద్యార్థుల్లో సృజన, సామర్థ్యాలను వెలికితీసేందుకు ‘ఈనాడు’ ఆధ్వర్యంలో నాలుగు నెలలపాటు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. వ్యాసరచన, చిట్టి కథలు, క్విజ్‌, చిత్రలేఖనం పోటీల నిర్వహణకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, తుని, మండపేట, కొవ్వూరు కేంద్రాల పరిధిలో 10 పాఠశాలలు చొప్పున ఎంపిక చేశారు. మొదటి దశలో 8, 9, 10 తరగతి విద్యార్థులకు గతేడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరు, ఈ ఏడాది జనవరి నెలల్లో నెలకు ఒక అంశం చొప్పున పోటీలు నిర్వహించారు. పాఠశాల స్థాయిలో సుమారు 21 వేలమందికిపైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ద్వితీయ దశలో ప్రాంతీయ స్థాయిలో ఫిబ్రవరిలో నిర్వహించిన పోటీల్లో 120 మంది పాల్గొన్నారు. ప్రాంతీయ స్థాయి విజేతలుగా నిలిచిన 72 మందికి ఆఖరిగా మూడో దశలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. వీరిలో 12 మంది విజేతలుగా నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని