
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వైస్ ఛాన్సలర్ కిషన్రావు, రచయితలు
మాచర్ల గ్రామీణ, న్యూస్టుడే : వెయ్యేళ్ల క్రితమే చాపకూడు ద్వారా సంఘ సంస్కరణకు బీజం వేసిన మహనీయుడు బ్రహ్మనాయుడు అని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ తంగెడ కిషన్రావు అన్నారు. సోమవారం మాచర్ల శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ ఆవరణలో ప్రముఖ రచయిత పావులూరి సతీష్బాబు రచించిన ‘చెన్నకేశవస్వామి ఆలయ చరిత్ర’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పల్నాడు ప్రాంతంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, ఆలయాలు ఉన్నాయని వాటిని సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, చరిత్ర పరిశోధనకు రచయిత సతీష్బాబు చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. తమ పూర్వీకులది దాచేపల్లి సమీపంలోని తంగెడ అని గుర్తు చేశారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత డాక్టర్ బెజ్జంకి జగన్నాధాచార్యులు, శివశంకర్, చక్రధర్ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ కుర్రిసాయి మార్కొండారెడ్డి, విశ్రాంత ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు, అధ్యాపకులు కేళం ఆదినారాయణ, వై.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.