logo

ప్రాణాపాయ స్థితిలో ఉన్నా పట్టించుకోరా..!

రాష్ట్రంలో పేరెన్నికగన్న సర్వజనాసుపత్రికి వస్తే మెరుగైన వైద్యం దొరుకుతుందన్న ఆశతో రోగులు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారు.

Published : 26 Jan 2023 04:41 IST

జీజీహెచ్‌లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు నిలిపేసిన వైనం
పునః ప్రారంభించాలని మూడున్నరేళ్లుగా బాధితుల వేడుకోలు
న్యూస్‌టుడే, గుంటూరు వైద్యం

సర్వజనాసుపత్రిలో మూత్రపిండాల విభాగం

రాష్ట్రంలో పేరెన్నికగన్న సర్వజనాసుపత్రికి వస్తే మెరుగైన వైద్యం దొరుకుతుందన్న ఆశతో రోగులు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారు. సర్కారీ వైద్యంపై పేదలకు మరింత నమ్మకం కలిగేలా వైద్యులు కూడా అత్యంత ఆధునిక చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిమితంగా ఉన్న వనరులనే వినియోగించుకుంటూ మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలను 2016, ఫిబ్రవరి 28న ప్రారంభించారు. ఇప్పటి వరకు 20 మందికి సర్జరీలు పూర్తి చేయగలిగారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలు ఖరీదు చేసే ఈ సర్జరీ ఆరోగ్యశ్రీ పథకం కింద గుంటూరు సర్వజనాసుపత్రిలో పైసా ఖర్చు లేకుండా చేస్తున్నారు. దీంతో రోగులు వస్తున్నప్పటికీ ఈ శస్త్రచికిత్సలు మూడున్నరేళ్ల నుంచి నిలిపివేశారు. దీనివల్ల కిడ్నీ మార్పిడి అవసరమైన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఇటీవల నిర్వహించిన సమావేశంలోనూ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పునఃప్రారంభించాలని సూచించడం గమనార్హం.

ఆలస్యం జరిగేకొద్దీ..

కిడ్నీలు ఏమాత్రం పని చేయని వైఫల్య దశకు చేరుకున్నవారు నిత్యం నరకం అనుభవిస్తుంటారు. రోజురోజుకూ ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతూ, దినదిన గండంగా కాలం గడుపుతున్న ఈ స్థితిలో వీరికి అవయవ మార్పిడి తప్పించి ఇతరత్రా చికిత్సలేవీ ఉండవు. కనీసం ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు కూడా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయలేని పరిస్థితి ప్రస్తుతం జీజీహెచ్‌లో నెలకొని ఉంది.

ప్రత్యేక గదిని కేటాయించాలి

కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసేందుకు మిలీనియం బ్లాక్‌లో రెండు మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లను కేటాయించాలని వైద్యులు కోరుతున్నారు. అదేవిధంగా సర్జరీ అనంతరం రోగికి చికిత్స అందించేందుకు అక్కడే ఉన్న ఐసోలేషన్‌ గదిని ఇవ్వాలని సూచిస్తున్నారు. దీన్ని ఎవరూ పట్టించుకోవడంలేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్‌ వైద్యులు అవసరం

నెఫ్రాలజీ విభాగంలో ప్రస్తుతం ఇద్దరు సహాయ ఆచార్యులు పని చేస్తున్నారు. వీరిని ఇటీవలే కొత్తగా నియమించారు. గతంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించిన సమయంలో పని చేసిన డాక్టర్‌ శివరామకృష్ణ గత సాధారణ బదిలీల్లో విజయవాడకు మార్చారు. ఈ రంగంలో ఆయనకు ఎంతో అనుభవం ఉన్నందున ఆయన సేవలను వినియోగించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

అంతా ఉచితమే.. అందుకే డిమాండ్‌

జీజీహెచ్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స పూర్తి ఉచితంగా చేస్తున్నారు. ఏడాది పాటు ఔషధాలు ఇస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలు ఖరీదు చేసే ఈ సర్జరీ ఒక్క పైసా ఖర్చు లేకుండా చేస్తున్నారు. అంతేగాకుండా ఇన్ఫెక్షన్‌ శాతం చాలా తక్కువగా ఉండే మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు ఉండటం మరో ప్రత్యేకత. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి రోగులు తరలి వస్తున్నారు. రోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా అధికారులు స్పందించి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగేలా చూడాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై సూపరింటెండెంట్‌ ప్రభావతి మాట్లాడుతూ త్వరలోనే ఈ సర్జరీలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొవిడ్‌ సమయంలో చేయలేకపోయామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని