logo

నేతన్నల నైపుణ్యానికి అబ్బురపడిన అమెరికా యువతి

అమెరికాకు చెందిన చేనేత నిపుణురాలు కైరా జఫ్ప్‌ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాంటుతో ఆసియా ఖండంలోని వివిధ దేశాల్లో చేనేత రంగం పరిస్థితులు, నైపుణ్యం వంటి వాటిపై అధ్యయనం చేస్తున్న కైరా తన భర్తతో కలిసి సోమవారం సిరిసిల్లలో పర్యటించారు.

Published : 06 Dec 2022 03:18 IST

అగ్గిపెట్టెలో ఇమిడే చీరను పరిశీలిస్తున్న కైరా

సిరిసిల్ల(విద్యానగర్‌), న్యూస్‌టుడే: అమెరికాకు చెందిన చేనేత నిపుణురాలు కైరా జఫ్ప్‌ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాంటుతో ఆసియా ఖండంలోని వివిధ దేశాల్లో చేనేత రంగం పరిస్థితులు, నైపుణ్యం వంటి వాటిపై అధ్యయనం చేస్తున్న కైరా తన భర్తతో కలిసి సోమవారం సిరిసిల్లలో పర్యటించారు. ఇప్పటికే పలు దేశాల్లోని చేనేత పరిశ్రమపై అధ్యయనాన్ని పూర్తిచేసుకొని భారతదేశంలోని తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మిక క్షేత్రాలైన పోచంపల్లి, గద్వాల, ఇతర నేత కార్మిక క్షేత్రాలైన సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ వంటి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సిరిసిల్లలోని పలువురు చేనేత కార్మికుల మగ్గాలను, వారు నేస్తున్న వస్త్రం, వారి నైపుణ్యాన్ని తెలుసుకున్నారు. చేనేత కళ నుంచి మరమగ్గాల వైపు సిరిసిల్ల నేతన్నలు మళ్లిన క్రమంపై ఆమె వివరాలు సేకరించారు. తన వినూత్నమైన చేనేత ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన వెల్ది హరిప్రసాద్‌ను కలిశారు. ఆయన నేసిన అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చూసి అబ్బురపడ్డారు. ఇంత అద్భుతమైన ప్రతిభా నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులను తాను చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకప్పుడు సిరిసిల్ల క్లస్టర్లో నేతన్నల ఇబ్బందులు, పరిశ్రమ సంక్షోభం, దాని నుంచి బయటపడిన విధానం, ప్రభుత్వం అందించిన సహకారం, పవర్‌లూం యంత్రాలను ఆధునికీకరించిన విధానం తెలుసుకున్నారు. చేనేత కార్మికుల నైపుణ్యంతో పాటు ఒక పవర్‌లూం క్లస్టర్‌గా మారిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆమె వెంట తెలంగాణ మరమగ్గాలు, జౌళి అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్‌, సిరిసిల్ల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ జిందం కళ, చేనేత, జౌళిశాఖ ఏడీ సాగర్‌ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు