logo

సమన్వయంతోనే బాధితులకు న్యాయం

న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సమన్వయంతోనే బాధితులకు సత్వర న్యాయం అందుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ స్పష్టం చేశారు.

Published : 26 Mar 2023 05:05 IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

మెట్‌పల్లిలో కోర్టును ప్రారంభిస్తున్న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

మెట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సమన్వయంతోనే బాధితులకు సత్వర న్యాయం అందుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ స్పష్టం చేశారు. మెట్‌పల్లి పట్టణంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత కోర్టును ప్రారంభించిన ఆయన ఆవరణలో మొక్క నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జగిత్యాల జిల్లా చారిత్రక ప్రాంతమని, ఇక్కడ ఎస్సారెస్పీతో పాటు గోదావరి ఒడ్డున ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు మాట్లాడుతూ జిల్లా నుంచి ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారని, న్యాయవాదులు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి, జస్టిస్‌ జి.అనుపమ చక్రవర్తి, జస్టిస్‌ ఏ.సంతోష్‌రెడ్డి, జస్టిస్‌ పుల్ల కార్తీక్‌లు మాట్లాడారు. ప్రిన్సిపల్‌ జిల్లా న్యాయమూర్తి నీలిమ జిల్లాలో కేసుల పురోగతిని వివరించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు హైకోర్టు న్యాయమూర్తులకు పుష్పగుచ్ఛం అందజేయగా, న్యాయవాదులు సన్మానించారు. మెట్‌పల్లి మండలం వేంపేటకు చెందిన హైకోర్టు న్యాయవాది అల్లూరి దివాకర్‌రెడ్డి రాజరాజేశ్వర స్వామి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. జిల్లా పాలనాధికారి యాస్మిన్‌బాషా, జిల్లా ఎస్పీ భాస్కర్‌,  లింబాద్రి, సభ్యులు, జిల్లాలోని న్యాయవాదులు పాల్గొన్నారు.


న్యాయస్థానాలపై ప్రజల్లో నమ్మకం కల్పించాలి

కోరుట్ల: న్యాయస్థానాలపై ప్రజల్లో నమ్మకం పెంచాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ పేర్కొన్నారు. శనివారం కోరుట్ల పట్టణ శివారులో నూతనంగా నిర్మించనున్న జూనియర్‌ సివిల్‌ కోర్టు భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు ఎన్నో బాధలతో కోర్టులను ఆశ్రయిస్తారని న్యాయవాదులు వారి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కోర్టు భవనాల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులను కోరుట్ల న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. అనంతరం కోరుట్ల సీనియర్‌ న్యాయవాది చాప కిశోర్‌ గీసిన చిత్రాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బాహూకరించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొలుగూరి శ్రీపతిరావు, చాప వందన, రఘు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని