logo

ఆనందం.. అంతలోనే విషాదం

కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు.

Published : 29 Mar 2024 02:12 IST

రోడ్డు ప్రమాదంలో వధువు తల్లి, ఇద్దరు బంధువుల మృతి

కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీస్తున్న పోలీసులు

టంగుటూరు, న్యూస్‌టుడే: కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. వారి సంతోషం చూసి విధికి కన్నుకుట్టిందేమో కానీ కొన్ని గంటల్లోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ముగ్గురిని కబళించింది. పెళ్లి కుమార్తె ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం శివారున జాతీయ రహదారిపై గురువారం ఉదయం చోటుచేసుకుంది. ప్రమాదంలో వధువు తల్లి, మేనమామ భార్య, పిన్ని కూతురు చనిపోగా.. వధువు సోదరుడు, మేనమామ, మేనమామ కుమారుడికి గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన రాయని అరుణ కుమార్తెకు కొత్తపాల్వంచకు చెందిన యువకుడితో పెళ్లిసంబంధం కుదిరింది. బుధవారం రాత్రి 9 గంటలకు వరుడి స్వగ్రామంలో వివాహమైంది. వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు బస్సుల్లో హాజరయ్యారు. అనంతరం వధువు తరఫున బంధువులంతా ఆయా వాహనాల్లో కందుకూరుకు తిరుగుపయనమయ్యారు. వధువు తల్లి అరుణ, సోదరుడు వేణు, మేనమామ తలపునేని వినోద్‌, ఆయన భార్య దివ్య, వారి కుమారుడు రామ్‌, పిన్ని కూతురు గుళ్లాపల్లి శ్రావణి కారులో బయలుదేరారు. గురువారం ఉదయం వీరు ప్రయాణిస్తున్న కారు తూర్పునాయుడుపాలెం వద్దకు వచ్చేసరికి డ్రైవర్‌ వినోద్‌ నిద్రలోకి జారుకోవటంతో రోడ్డు అంచున ఫెన్సింగ్‌ సిమెంట్‌ దిమ్మెలను వేగంగా ఢీకొంది. కారు పల్టీలు కొడుతూ రెండు దిమ్మెలను ఢీకొట్టి మరో దిమ్మెకు తగిలి ఆగింది. వాహనం నుజ్జునుజ్జయ్యింది. రాయని అరుణ(50), తలపనేని దివ్య(30), గుళ్లాపల్లి శ్రావణి (22) తలలకు తీవ్రగాయాలై కారులోనే మృతిచెందారు. రాయని వేణు, తలపనేని వినోద్‌ తీవ్రంగా గాయపడ్డారు. రామ్‌ (3)కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని