logo

ఆస్తి గొడవ.. తండ్రి చేతిలో కొడుకు హతం

భూమి పంచాలంటూ గొడవ పడి గాఢ నిద్రకు చేరుకున్న సొంత కొడుకును అతని తండ్రి బలమైన కర్రతో కొట్టి అంతం చేశాడు.

Published : 02 Dec 2022 02:02 IST

పెద్దేముల్‌, న్యూస్‌టుడే: భూమి పంచాలంటూ గొడవ పడి గాఢ నిద్రకు చేరుకున్న సొంత కొడుకును అతని తండ్రి బలమైన కర్రతో కొట్టి అంతం చేశాడు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా, పెద్దేముల్‌ మండలంలోని ఇందూరు గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామీణ సీఐ రాంబాబు, స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన మహబూబ్‌ జానీకి ముంతాజ్‌ బేగం, రిజ్వాన భార్యలు. మొదటి భార్యకు కూతురు, రెండో భార్యకు కొడుకు గోరెమియా(26), కుతూరు ఉన్నారు. జానీకి గ్రామంలో 8 ఎకరాల భూమి ఉంది. అందరి పెళ్లిళ్లు జరిగాయి. ఇళ్ల పంపకాలూ పూర్తయ్యాయి. పక్కపక్కనే ఉంటున్నారు. తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతుండటంతో నాలుగేళ్ల క్రితం రిజ్వాన తన కొడుకు గోరెమియా, కోడలు నసీమా బేగంలను తీసుకుని జీవనోపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లిపోయారు. అక్కడే కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండు, మూడు మాసాలకు ఒకసారి ఇందూరు వచ్చి వెళ్లేవారు. వచ్చిన ప్రతిసారి తమకు గల 8 ఎకరాల భూమి విషయమై గొడవ జరిగేది. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం గోరెమియా ఇందూరుకు వచ్చాడు. మద్యం తాగి తండ్రి జానీతో గొడవకు దిగాడు. బుధవారం సైతం తండ్రితో భూమి పంపకాలు చేయాలని గొడవకు దిగడంతో  రోజంతా ఇలాగే గడిచింది. 8 ఎకరాల భూమిని గ్రామంలోనే ఓ రైతుకు కౌలుకు ఇచ్చామని వివరించారు. కౌలు డబ్బులు ఇవ్వడం లేదు. భూమి పంపకాలు కావడం లేదు. మీ అంతు చూస్తానని హెచ్చరించి చీకటి పడగానే గోరెమియా తన ఇంట్లో మంచంపై నిద్రపోయాడు. గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత అప్పటికే పథకం వేసుకున్న తండ్రి బలమైన కర్రతో దాడి చేసి చంపేశాడు. కొడుకు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత పరారయ్యాడు. ఉదయం 8 గంటల ప్రాంతంలో పక్కింటి వారు వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో అతను పడి ఉన్నాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై అబ్దుల్‌ రవూఫ్‌ సిబ్బందితో గ్రామానికి చేరుకుని సీఐ రాంబాబుకు తెలిపారు. పోలీసులు సంఘటన జరిగిన ప్రదేశంతో పాటు పలు చోట్ల గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడి తల్లి రిజ్వాన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని